ఇటీవల విశాఖ పర్యటన గావించి ‘డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను ప్రైవేటు పరం చేయవద్దని ‘జనసేన’ అధినేత కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. లాభాలు ఆర్జిస్తున్న ‘డిసిఐ’ను ప్రైవేటు పరం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేయాలని అన్న పవన్, పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నష్టాలలో ఉన్న సాలెం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానిని కలిసి ఒక మెమొరాండం ఇచ్చిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ… కనీసం ఈ విధంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ నాయకులకు ఏం అడ్డు వచ్చిందో? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ఏపీ నేతల నుండి కనీసం పోరాటపటిమ కూడా లేదంటూ ఈ సందర్భంగా ఎత్తిచూపారు ‘జనసేన’ అధినేత. ఒక సమస్యను అక్కడితో వదిలేయకుండా, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడడం తన నైజంగా పవన్ మరోసారి చాటుకున్నారు.
సాధారణంగా రాజకీయ నాయకులైతే ఒకసారి వచ్చి పరామర్శించిన తర్వాత ఇక ఆ సమస్యను గాలికి వదిలేసినట్లే భావించవచ్చు. ఇంకా చెప్పాలంటే… “ఏదైనా అధికారం ఉంటేనే” అన్న కోణంలో ప్రజలకు స్పీచ్ లు ఇస్తారు. కానీ పవన్ మాత్రం, ఒక సమస్యను పట్టుకుంటే, వాటిపై ప్రభుత్వాలు దిగి వచ్చేదాకా పోరాడడం హర్షించదగ్గ విషయం. గతంలో ‘ఉద్దనం’ కిడ్నీ బాధితుల వ్యవహారంలో కూడా పవన్ సమస్య పరిష్కారం అయ్యే దాకా వరుసగా ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఇతర నేతల నుండి పవన్ ను వేరు చేస్తోందని చెప్పవచ్చు.



