వచ్చే ఏడాదిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్తోన్న ‘జనసేన’ అధినేతకు – టాప్ తెలుగు మీడియా ఛానల్స్ కు నడుమ ‘సెటిల్మెంట్’ కుదిరిందా? అంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. శ్రీరెడ్డి ఉదంతంలో ఆగ్రహానికి గురైన పవన్ కళ్యాణ్, తెలుగు టాప్ మీడియా ఛానల్స్ ను అన్నింటిని బ్యాన్ చేయండి అంటూ పిలుపునిచ్చిన వైనంతో, పవర్ స్టార్ కవరేజ్ ను సదరు మీడియా ఛానల్స్ పక్కన పెట్టేసాయి. దీంతో మున్ముందు పవన్ పరిస్థితి ఏంటా అన్న కోణంలో రకరాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
అయితే అప్పుడే ‘నా పేరు సూర్య’ సినిమా సందర్భంలో కూడా అల్లు అరవింద్ మీడియా వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ అదే మీడియా కవరేజ్ తో ‘నా పేరు సూర్య’ సినీ వేడుకలను నిర్వహించుకోవడం… అన్ని వడివడిగా జరిగిపోయాయి. ఎటొచ్చి పవన్ కళ్యాణ్ కే బెడిసికొట్టగా, ఆదివారం నాటితో దీనిపై ఓ స్పష్టత వచ్చినట్లేనని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య “డీల్” పూర్తనయినట్లుగా కనపడుతోంది. ప్రముఖ తెలుగు మీడియా ఛానల్స్ అన్నీ పవన్ శ్రీకాకుళం కవరేజ్ ను పూర్తిగా ఇచ్చాయి.
అయితే ఒకప్పటిలా పవన్ కు అనుకూలంగా ప్రసారాలు చేయలేదు, అలాగే పవన్ కు ప్రతికూలంగా కూడా కధనాలు ఇవ్వలేదు కానీ, పవన్ ప్రసంగాన్ని, పర్యటనను పూర్తిగా కవర్ చేసాయి. దీంతో పవన్ కు – మీడియా వర్గీయుల మధ్య సయోధ్య కుదిరినట్లే భావించవచ్చు. తన ప్రసంగం మొదలుపెడుతూనే మీడియా వర్గాలకు కూడా ధన్యవాదాలు తెలిపారు పవన్. ఎంతో వ్యయప్రయాసలకొడ్చి ఇక్కడకు విచ్చేసిన మీడియా ప్రముఖులందరికీ కృతజ్ఞతలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.



