ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ విశాఖలో జనసేన సమావేశంలో మాట్లాడిన మాటలు జగన్ జీర్ణించుకోవడం కష్టమే. జనసేన, టీడీపిలు పొత్తులే పెట్టుకోకూడదని జగన్ కోరుకుంటే వాటిని ఆయనే స్వయంగా కలిపారు. ఆ తర్వాత అయినా వాటి మద్య విభేదాలు తలెత్తి విడిపోయి ప్రభుత్వం కూలిపోతుందని జగన్ ఆశపడితే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, రెండు పార్టీల మంత్రులు మరింత దగ్గరయ్యారు. అందరూ ఒకే కుటుంబమన్నట్లు సహకరించుకుంటున్నారు.
కానీ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ మనసు కరగదా?విరగదా?అని ఆశగా ఎదురుచూస్తున్న జగన్ని పవన్ కళ్యాణ్ మరోసారి నిరాశ పరిచారు.
విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో కూటమిలో పార్టీల మద్య ఐఖ్యత చాలా ముఖ్యమని, వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించారు.
కూటమి ప్రభుత్వం 14 నెలల పాలన తర్వాత కూడా పవన్ కళ్యాణ్లో ఎటువంటి మార్పు రాకపోగా సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే అందరం ముందుకు సాగాలని చెప్పడం జగన్మోహన్ రెడ్డికి కంపరం కలిగించవచ్చు. కానీ ఏం చేయగలరు దేవుడి స్క్రిప్ట్ అలా ఉంది మరి!
ఇది సరిపోదన్నట్లు పవన్ కళ్యాణ్ తన మంత్రులను, జనసేన నాయకులను వెంటబెట్టుకొని రుషికొండకి వెళ్ళారు. అక్కడ జగన్ ముచ్చటపడి రూ.454 కోట్ల ప్రజాధనంతో కట్టించుకున్న విలాసవంతమైన ప్యాలస్లను సందర్శించారు. ఆ విలాసాల గురించి వారు మాట్లాడుకుంటుంటే తీసిన వారి ఫోటోలు, వీడియోలు మీడియాలో వచ్చాయి.
నాడు పవన్ కళ్యాణ్ రుషికొండ ప్యాలస్లోకి అడుగుపెట్టనీయకుండా జగన్ అడ్డుకున్నారు. కానీ జగన్ ఎంతో ముచ్చటపడి కట్టించుకున్నా ఆ ప్యాలస్లో ఇంతవరకు ఒక్కసారి కూడా అడుగు పెట్టనే లేదు. ఇక ముందు పెట్టే అవకాశం ఉంటుందో లేదో?
కానీ జగన్ వద్దనుకున్న పవన్ కళ్యాణ్ నేడు తన పార్టీ నేతలను వెంటబెట్టుకొని ఆ ప్యాలస్లో నిలబడి ఫోటోలు, వీడియోలు దిగి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే, అక్కడ తాడేపల్లి ప్యాలస్లో ఒంటరిగా ఉంటున్న జగన్ పరిస్థితి ఎలా ఉంటుందో పాపం!





