ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాజా ఆదేశాలు వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చిత్తూరు జిల్లాలో ఆటవీ భూములు కబ్జా చేసి ఫామ్హౌస్ నిర్మించుకున్నందుకు ఆయనపై, కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు, అటవీ చట్టాల ప్రకారం వేర్వేరుగా కేసులు నమోదు చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
పెద్దిరెడ్డి కుటుంబం ఆటవీభవవములు కబ్జా చేస్తుంటే వారిని అడ్డుకోలేకపోయిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
వైసీపీ సీనియర్ నేతలలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒకరు. మంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఆయనకు పదవి, అధికారం లేకపోయినా చిత్తూరు జిల్లా రాజకీయాలను కంటి సైగతో శాశిస్తున్నారు. సొంత పార్టీకే చెందిన మాజీ మంత్రి రోజా కూడా ఆయనంటే హడలిపోతుంటారు.
అటువంటి శక్తివంతమైన నాయకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ నేరుగా అధికారులను ఆదేశించడం మామూలు విషయం కాదు. కుంభస్థలం కొట్టే ప్రయత్నంగానే చూడవచ్చు.
ఒకవేళ పెద్దిరెడ్డిపై కేసు నమోదు చేస్తే ఆయన తప్పకుండా ముందస్తు బెయిల్ తీసుకొని కేసు విచారణ ముందుకు సాగకుండా నిలువరించే ప్రయత్నం చేస్తారు. కనుక పెద్దిరెడ్డిపై కేసు నమోదు చేయడం గొప్ప విషయం కాదు. ఆ తర్వాత ఈ కేసుని ఎంతవరకు తీసుకువెళ్ళగలరనే దానిపై పవన్ కళ్యాణ్ శక్తి సామర్ధ్యాలు వెల్లడవుతాయి.
జగన్ రుషికొండని బోడిగుండులా గొరిగేసి వందల కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన ప్యాలస్లు నిర్మించుకుంటుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకోలేకపోయాయి. టీడీపీ కార్యాలయాలపై, చంద్రబాబు నాయుడు నివాసంపై వైసీపీ మూకలు దాడులు చేస్తున్నప్పుడు పోలీసులు అడ్డుకోలేకపోయారు. మరి మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అటవీ భూములు కబ్జా చేస్తుంటే అడ్డుకునే సాహసం అటవీశాఖ అధికారులకు ఉంటుందా?




