గత రాత్రి ఔటర్ రింగు రోడ్డుపై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో స్కోడా కారును స్వయంగా నడుపుకుంటూ వెళ్లిన భరత్ రాజు, ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడని, అతి వేగమే భరత్ మరణానికి అసలు కారణంగా చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని నోవాటెల్ నుంచి గచ్చిబౌలిలోని ఇంటికి బయలుదేరి వెళ్ళే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.
ప్రమాద సమయంలో కారులో వోడ్కా మద్యం బాటిళ్లు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని, భరత్ మద్యం తాగి ఉన్నారా? లేదా? అన్న విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని తెలిపారు. ప్రమాదం గురించి ముందే పసిగట్టి బలంగా బ్రేకులు వేసినట్టుగా రోడ్డుపై పడ్డ టైర్ గుర్తులు చూపుతున్నాయని, ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలు, కుడి చెయ్యి విరిగిపోయాయని చెప్పారు.
తలకు బలమైన గాయం కూడా తగిలిందని, తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసేంత సమయం కూడా లేకుండానే ప్రాణాలు పోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా రింగు రోడ్డుపై లారీని నిలిపినందుకు యాజమాన్యం పైనా కేసును నమోదు చేసినట్టు తెలిపారు. దీంతో భరత్ స్పీడ్ డ్రైవింగ్ లారీ యాజమాని మెడకు కూడా చుట్టుకున్నట్లయ్యింది.
మరో వైపు డెడ్ బాడీని దక్కించుకున్న కుటుంబ సభ్యులు భరత్ రాజు అంత్యక్రియలకు ఏర్పాటు చేసారు. రవితేజ మరో సోదరుడు రఘు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనుండగా, ఇందుకు సంబంధించిన సహాయ సహకారాలు సినీ నటుడు ఉత్తేజ్ అందిస్తున్నాడు. భరత్ ను కడసారి చూసేందుకు మిత్రులు, ప్రముఖ హాస్య నటులు అలీ, రఘుబాబు, నిర్మాతలు తదితరులు హాజరయ్యారు.



