వైసీపీ కండువా కప్పుకోగానే ఒక అపరచితుడిలా మారిపోతున్నారు నేతలు. ఎన్నికల వేళ పార్టీల కండువాలు మార్పు ప్రక్రియ అనేది సర్వసాధాణం. అందులోను పొత్తులో ముందుకెళ్తున్న పార్టీల మధ్య త్యాగాలు చేయాల్సిన సందర్భాలే ఎక్కువ. పార్టీల టికెట్లు ఆశించి భంగపడిన వారు ప్రత్యర్థి పార్టీ కండువా కప్పుకోవడం, అప్పటివరకు ఉన్న పార్టీని దూషించడం ఎన్నికల ఆనవాయితీగా వస్తుంది.
ఈ నేపథ్యంలో జనసేన నుండి విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్ ఆశలకు పొత్తు ధర్మం నీళ్లు జల్లింది. ఈ సీటుని పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కి దక్కింది. ఇందుకు గాను జనసేన పార్టీ మీద, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద అసహనంతో జనసేన నుండి వైసీపీ గూటికి చేరారు పోతిన మహేష్. ఒక్కసారి మేడలో వైసీపీ కండువా పడగానే పోతిన మహేష్…కత్తి మహేష్ మాదిరి మారిపోయారు.
గతంలో కత్తి మహేష్ కూడా ఇదే తరహాలో కొన్ని నెలలపాటు టీవీ డిబేట్ లలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని నిత్యం చర్చలలో ఉంచారు. అంతటితో ఆగకుండా ఆయన కుటుంబాన్ని కూడా మీడియా కు ఈడ్చి పవన్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. చివరికి ఆయన ఈ విమర్శల్ని చేయడానికి వెనుక ఉండి ప్రోత్సహించింది ఎవరో తెలిసే సమయానికి అనుకోని ప్రమాదనికి గురై ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఆ మహేష్ స్థానాన్ని ఈ మహేష్ భర్తీ చేస్తున్నట్లుగా ఉంది. గడిచిన పదేళ్లుగా జనసేన పార్టీ తరుపున నిలబడి స్థానికంగా ఒక నాయకుడి స్థానానికి ఎదిగి కేవలం సీటు రాలేదు అనే కారణం చెప్పి వైసీపీ ఫ్యాన్ కింద చేరారు. కనీసం ఫ్యాన్ గుర్తు పైన అయినా పోతిన పోటీ చేయబోతున్నారా అంటే అక్కడ కూడా ఎవరో నాయకుడి గెలుపు కోసం ఈస్థాయికి దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు మహేష్.
పవన్ వ్యక్తిగత జీవితం మహేష్ కు సీటు రాకముందు వరకు ఎవరికీ తెలియనిదా..? ఆయన వివాహాల గురించి, వైవాహిక సంబంధాల గురించి ఇప్పుడే తెలిసొచ్చిందా..? తనతో విడాకులు తీసుకొని వేరే జీవితం గడుపుతున్న ఆడవారి గురించి ఇలా బహిరంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం అంటూ పవన్ పదేపదే చెపుతున్నప్పటికీ జగన్ మొదలు వైసీపీ నేతలందరిది ఇదే తీరు.
గతంలో పవన్ మీద ఇదే విమర్శలు చేసిన వైసీపీ నేతలను తప్పుబట్టిన పోతిన మహేష్ ఇప్పుడు అంతకు మించి అనే స్థాయికి దిగజారి చేస్తున్న ఈ విమర్శలకు ఏ పేరు పెట్టాలి..? వైసీపీ పార్టీ నుండి కూడా టీడీపీ, జనసేన లోకి చాల మంది నాయకులే వచ్చారు. కానీ వారెవ్వరిని టీడీపీ, జనసేనలు ఈవిధంగా ఉపయోగించలేదు. వారిని మీడియాకు పంపి జగన్ మీద కానీ జగన్ భార్య మీద ఆయన కుటుంబం మీద కానీ ఈ తరహా విమర్శలు చేపించలేదు.
కానీ వైసీపీ మాత్రం టీడీపీ, జనసేన ల సంస్కారాన్ని వారి చేతకాని తనంగా తీసుకుని ఇటువంటి నాయకులను వాడుకుంటూ ప్రత్యర్థిని కించపరుస్తున్నాం అనే భ్రమలో ఉంటూ తమను తామే దిగజార్చుకుంటున్నారు. జగన్ కుటుంబ చరిత్ర బయటకు వచ్చిన ఇటువంటి సందర్బాల్లో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైసీపీ ఇలా పెళ్ళాలు, పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగత విమర్శలు చేయడం నిజంగా పవన్ సంస్కారానికి, సహనానికి ఒక అగ్ని పరీక్షా వంటిదే అని చెప్పాలి.
ఈ సంస్కారం ఎదో రోజు పగలడం అది లావాలా మారడం ఖాయంగా కనపడుతుంది. ఆ స్థాయి వరకు వైసీపీ నేతలు పవన్ పై వ్యక్తిగత దాడికి పాల్పడుతూనే ఉంటారనేది కూడా స్పష్టమయింది. మరి ఆ అగ్ని పర్వతం బద్దలయ్యే రోజు కోసం జనసైనికులు ఎదురుచూస్తున్నారు.






