బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్న “జై లవకుశ” టీజర్ పై సర్వత్రా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ‘యంగ్ టైగర్’ అభిమానులకు ఐ ఫీస్ట్ లా ఉన్న ఈ టీజర్ పై ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ‘అదిరింది’ అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అందరినీ మెప్పించిన ఈ టీజర్, ఒక్క పూరీ జగన్నాధ్ ను మాత్రం ఆలోచింపచేసేలా చేసిందట.
అవును… ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… ఈ టీజర్ లో విడుదలైన ‘జై’ పాత్ర, అచ్చం తాను రాసుకున్న స్క్రిప్ట్ లో మాదిరే ఉందట. మరో విశేషం ఏమిటంటే… ఈ కధను పూరీ జగన్నాధ్ గతంలోనే తారక్ కు చెప్పారట. నెగటివ్ షేడ్ లో తాను రాసుకున్న ఈ క్యారెక్టర్ ను ‘జై లవకుశ’ కోసం వాడేసుకున్నారని, ‘పైసా వసూల్’ సెట్స్ లో ఉండగానే పూరీ కాస్త డిస్ట్రబ్ అయినట్లుగా ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ సంచలన కధనాన్ని ప్రచురించింది.
ముందుగా పూరీ నుండి కధ విన్న జూనియర్ ఎన్టీఆర్ కొన్ని మార్పులు సూచించారని, దానికి పూరీ అంగీకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను అక్కడితో ఆపేసారని, ఇద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్న తరుణంలో… తాను చెప్పిన కధలోని పాత్ర ‘జై లవకుశ’ రూపంలో ముందుకు రావడంతో పూరీకి అసలు ట్విస్ట్ ఎదురైనట్లుగా ఈ కధనం సారాంశం.
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ‘టెంపర్’ ఇచ్చిన తనకు తారక్ ఇలా చేస్తారా? అంటూ హర్ట్ అయినట్లుగా తెలుపగా, ఇదే విషయమై దర్శకుడు బాబీని సంప్రదిస్తే… ఇది ఒరిజినల్ స్క్రిప్ట్ అని, ఎక్కడా కాపీ చేసింది కాదని, తాను మాట్లాడడం కన్నా సినిమా విడుదలైన తర్వాత స్క్రిప్ట్ మాట్లాడుతుందని బాబీ సమాధానం ఇచ్చినట్లుగా సదరు కధనం తెలిపింది. సంచలనంగా మారిన ఈ కధనం అభిమానుల్లోనే కాదు, ట్రేడ్ వర్గాలలోనూ చర్చనీయాంశంగా మారింది.



