ఏపీ శాసనసభ ఎన్నికలలోగా చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి ముఖ్యనేతలందరినీ ఏదో ఓ కేసుతో జైలుకి పంపిద్దామనుకొంటే, ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చేసిందని వైసీపి నేతలు ఎంత బాధపడుతున్నారో తెలీదు. కానీ ఉరుము లేని పిడుగులా వారి అధినేత జగన్ నెత్తి మీదే అక్రమాస్తుల కేసు విచారణ బాంబులా పడటంతో బహుశః అందరూ షాక్ అయ్యుంటారేమో?
లంకకు విభీషణుడు ఎలాగో వైసీపికి రఘురామ కృష్ణరాజు కూడా అలాంటివారే అనుకోవచ్చు. ఆయనే సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
జగన్మోహన్ రెడ్డి గత పదేళ్ళుగా ఆ కేసులను ముందుకు సాగనీయకుండా చేస్తూ, విచారణకు హాజరుకాకుండా తప్పించుకొంటున్నారని, ఈ లెక్కన మరో వంద సంవత్సరాలైన ఈ అక్రమాస్తుల కేసుల విచారణ పూర్తికావని, కనుక ఈ కేసుల విచారణ వేగవంతం చేయాలని సీబీఐని ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు.
దానినే సుప్రీంకోర్టు ఎల్లుండి శుక్రవారం విచారణకు చేపట్టనుంది. జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టనుంది. అంతమాత్రన్న సుప్రీంకోర్టు వెంటనే ఏదో ఒకటి తేల్చి పడేస్తుందనుకోలేము. కానీ తప్పకుండా అక్రమస్తుల కేసుల విచారణకు డెడ్లైన్ విధించే అవకాశం ఉంది.
అదే జరిగితే ఎన్నికలకు ముందు వైసీపి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అంటే ఈ కేసులలో సీబీఐ కోర్టు బెయిల్ రద్దు చేస్తుందని కాదు. సుప్రీంకోర్టు కలుగజేసుకొన్నా ఈ కేసులు ఇప్పట్లో తేలేవీ కావని అందరికీ తెలుసు.
కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసుల గురించి వైసీపి నేతలు ఏవిదంగా మాట్లాడుతూ, వైసీపి అనుకూల మీడియాలో ఆయనను దోషి అన్నట్లు రాసుకొని సంతోషపడుతున్నారో, అదేవిదంగా ఈ అక్రమస్తుల కేసుల విచారణ వేగవంతం అయితే, ‘గిట్టని మీడియా’లో ప్రతీరోజూ ఆ కేసుల వార్తలే వస్తుంటాయి. ఆ కేసులలో ‘నిందితుల పేర్లు’ ప్రతీరోజూ వినపడుతుంటాయి. కనుక ఎన్నికలకు ముందు ‘అక్రమస్తుల కేసుల విచారణ’ టిడిపి, జనసేనలకు ఆయుధంగా మారుతుంది. ఈ అక్రమస్తుల కేసుల విచారణ గురించి టిడిపి, జనసేనలు ప్రజలకు ఏవిదంగా వివరిస్తాయో అందరికీ తెలుసు. దాంతో ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక వైసీపికి ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే.




