అద్దాల మేడలో కూర్చుని దారినపోయే వారిపై రాళ్ళు విసరకూడదని పెద్దలు ఊరికే అనలేదు. ఇది అక్షరాల జగన్ ప్రభుత్వానికి వర్తిస్తుంది.
మాకు తిరుగేలేదని చెప్పుకుంటూనే టిడిపి, జనసేనలపై బురద జల్లి ఎన్నికలలో రాజకీయంగా చావు దెబ్బ తీయాలనే దురాలోచనతో వ్యూహం, యాత్ర-2 సినిమాలు తీయించారు.
కానీ యాత్ర-2కి ఉచితంగా టికెట్లు ఇస్తున్నా చూసేవాళ్ళు లేరు. కనుక దానిపై పెట్టిన పెట్టుబడి కూడా తిరిగివచ్చే పరిస్థితి కనబడటం లేదు.
కానీ ఆ సినిమా తీసిచ్చినందుకు దర్శకుడు మహి వి. రాఘవ్కు హార్సిలీ హిల్స్లో కోట్లు విలువ చేసే భూమిని అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన్నట్లు జగన్ ప్రభుత్వం నజరానాగా ఇచ్చేసింది!
ఫ్రీగా టికెట్లు ఇస్తామన్నా వైసీపి నేతలు, కార్యకర్తలు కూడా యాత్ర-2 సినిమా చూసేందుకు ఇష్టపడకపోవడం ఓ అవమానం. సినిమా ఆడకపోవడం వలన కలిగే నష్టం… దానికి తోడు హార్సిలీ హిల్స్ క్విడ్-ప్రో వ్యవహారంతో వైసీపి పరువు కూడా పోయింది.
యాత్ర-2తో టిడిపి, జనసేనలను దెబ్బ తీయాలనుకుంటే అది బెడిసికొట్టి వైసీపి డబ్బు, పరువే పోయింది. అదీ ఎన్నికలకు ముందు!
దాని తర్వాత ఈనెల 23న వ్యూహం, మార్చి 1న శపధం సినిమాలు రిలీజ్కు సిద్దంగా ఉన్నాయి. అది కూడా టిడిపి, జనసేనలపై బురద జల్లడానికే తీసిందే. అది కూడా వైసీపికి ‘బ్యాక్ ఫైర్’ అవడం ఖాయమే.
ఇటువంటి సినిమాలతో ప్రతిపక్ష నాయకులను దుష్టులు, దుర్మార్గులు అని చూపాలనుకోవడం, రాజకీయంగా దెబ్బతీయాలనుకోవడం వైసీపికి గొప్ప ‘వ్యూహం’గా అనిపించింది.
కానీ అదే… అమరావతిలో జరిగిన యాధార్ధ ఘటనలను, జీవనోపాధి కోల్పోయి 57 నెలలుగా నిరవధికంగా ధర్నా చేస్తున్న రాజధాని రైతుల కన్నీటి గాధలను ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ ప్రముఖ మీడియా సంస్థ సినిమా తీస్తే, వైసీపికి అది చాలా తప్పుగా కనిపిస్తోంది!
ఆ సినిమాలో జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలపై బురద జల్లెవిదంగా చూపారని, కనుక ఫిబ్రవరి 15న ఆ సినిమా విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని, ఆ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరుతూ వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేశారు.
దానిపై ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అత్యవసరం లేదని, తదుపరి విచారణలో నిర్ణయం ప్రకటిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
వ్యూహం, యాత్ర-2, రాజధాని ఫైల్స్ మూడు సినిమాల ట్రైలర్స్కు వచ్చిన స్పందనే ఆంధ్ర ప్రజల అభిమతాన్ని సూచిస్తున్నా వైసీపి నేతలు గుర్తించలేకపోతున్నారు… ఎన్నికలలో ఓడిపోయిన కేసీఆర్లాగ!




