ఏపీ రాజకీయాలో రాజారెడ్డికి చోటు ఉందా?

YS Sharmila with son Rajareddy amid talks of his political entry in Andhra Pradesh

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజారెడ్డే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అసలు సిసలైన వారసుడని ప్రకటించారు.

ఆమె వైసీపీ ఫేక్ వీడియోని ఖండిస్తూ ఈ మాట అన్నప్పటికీ, తన కొడుకు రాజారెడ్డిని ఏపీ రాజకీయాలలోకి తీసుకువచ్చే ఆలోచన ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

అతనిని తెస్తారా లేదో… తేదలిస్తే ఎప్పుడు తెస్తారో తెలీదు కానీ వైఎస్ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాలలోకి ప్రవేశిస్తే ముందుగా జగన్‌, వైసీపీకే ఇబ్బందికరంగా మారుతుంది.

కానీ ఇంతవరకు వైఎస్ షర్మిలే ఏపీ రాజకీయాలలో నిలదొక్కుకోలేకపోయారు. ఆమెను నమ్ముకుంటే కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఎటువంటి ప్రయోజనమూ కలుగలేదు.

ఈ పరిస్థితిలో ఆమె తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాలలో తీసుకువస్తే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందా? అంటే అనుమానమే.

రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డినే వైఎస్ వారసుడుగా భావిస్తున్నారు కనుకనే ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పార్టీని ముఖ్యంగా నేతలని రాజకీయంగా, ఆర్ధికంగా చాలా బలోపేతం చేసుకున్నారు.

ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం నానాటికీ బలపడుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడుగా నారా లోకేష్‌ సిద్దంగానే ఉన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ విషయం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. కనుక పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ఇద్దరికీ అటువంటి అవకాశం కల్పించేలా ముందస్తు ప్రణాళిక సిద్దం చేసుకునే ఉంటారు. బహుశః అందువల్లే వారిరువురూ అన్నదమ్ముల్లా చాలా అన్యోన్యంగా ఉంటున్నారనుకోవచ్చు.

కనుక ఓ పక్క ఏపీలో కూటమి ప్రభుత్వం, మరోపక్క జగన్‌ నేతృత్వంలో వైసీపీ బలంగా ఉన్నందున రాజారెడ్డి రాజకీయ ప్రవేశం చేస్తే అతని జీవితం కూడా అస్తవ్యస్తం కావచ్చు.

రాజకీయాలలో అడుగుపెడితే తప్పక బురద కూడా అంటుకుంటుంది కనుక రాజారెడ్డి రాజకీయ ప్రవేశం ప్రస్తుతానికి ఊహాజనితమైన ఆలోచనగానే పరిగణించి విస్మరించవచ్చు.

 

ADVERTISEMENT
Latest Stories