చెన్నైలో రజనీకాంత్ కళ్యాణ మండపంలో పరమహంస యోగానంద రచించిన ‘ది డివైన్ రొమాన్స్’ తమిళ అనువాదం ‘దైవీక కాదల్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంలో ప్రసంగించిన సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ… తాను స్వయంగా ఓ పుస్తకాన్ని విడుదల చేయడం ఇదే మొదటిసారని, ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చూసిన మహోన్నత వ్యక్తులు మనకు అందించిన పుస్తకం కావడం వల్లే దీన్ని ఆవిష్కరించానని అన్నారు.
‘మనమంతా దుర్యోధనుడిలాగే ఏం చేయకూడదు అనుకుంటామో అదే చేస్తామని, అలా కాకుండా అర్జునుడిలా ఏం చేయాలనుకుంటామో అది మాత్రమే చేయగలిగితే మనిషి జీవితం భగవంతుడిని చేరుతుందని’ తెలిపారు. తనను ఓ సినిమా స్టార్ గా చూడడం కంటే ఆధ్యాత్మికవాది అని గుర్తించడాన్ని ఎక్కువ ఇష్టపడతానని, సినిమాల కంటే కూడా తనకు ఆధ్యాత్మిక మార్గమే ఇష్టమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు సూపర్ స్టార్.
మనిషి జన్మ అనేది దేవుడి కృప అని, మానవత్వంతో జీవిస్తేనే ఆ జన్మకు సార్ధకత చేకూరుతుందని సూచించారు. తాను రామకృష్ణ పరమహంస నుంచి జీవితాన్ని నేర్చుకున్నానని, అలాగే రమణ మహర్షి రాసిన ‘నేను ఎవరిని’ అనే పుస్తకం నుంచి మనిషి జీవన గమనాన్ని గ్రహించానని వెల్లడించారు. జీవితాన్ని సార్ధకత చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గమే సరైనదని, ఇది అందరూ గుర్తించాలని పిలుపునిచ్చారు.



