‘ధృవ’ సినిమాతో మొదటిసారిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్, ఇక నుండి వైవిధ్యానికి పెద్ద పీట వేస్తానని ప్రమోషన్ కార్యక్రమాలలో చెప్పారు. అందుకు తగిన విధంగానే విలక్షణతకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి సుకుమార్ ను, తన తదుపరి సినిమాకు దర్శకుడిగా ఎంపిక చేసుకుని తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోయే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందోనని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపధ్యంలో, ఈ సంక్రాంతికి ఓ వార్త బయటకు వచ్చింది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటోన్న ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లబోతుందని, ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదలను టార్గెట్ గా పెట్టుకుందని తెలుస్తోంది. పూర్తి గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో చెర్రీ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసినట్లుగా లేటెస్ట్ టాక్. ‘అ…ఆ…’ ద్వారా పరిచయమైన అనుపమ, ‘శతమానం భవతి’ ద్వారా ఈ సంక్రాంతికి మరోసారి ప్రేక్షకులను పలకరించింది. గ్రామీణ కట్టుబొట్టులో అద్భుతంగా ఉండడంతో ఈ బొమ్మకే సుక్కూ ఓటు వేసినట్లుగా టాక్.
ప్రస్తుతం ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న రామ్ చరణ్, మరికొద్ది రోజుల్లో వీటిని పూర్తి చేసుకుని, సుకుమార్ సినిమాకు కావాల్సిన మేకోవర్ పై దృష్టి సారిస్తారని, అలాగే సుక్కూ సినిమా షూటింగ్ జరుగుతుండగనే, మెగాస్టార్ చిరంజీవితో మరో సినిమాను నిర్మించేందుకు చెర్రీ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ లో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరిస్తానని రామ్ చరణ్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం సినీ అభిమానులకు తెలిసిందే.



