చంద్రబాబు సర్కార్ పై అనేక ఆరోపణలు చేసిన మాజీ టీటీడీ చీఫ్ ప్రెసిడెంట్ రమణ దీక్షితులు తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను దక్కించుకుంది. ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, తద్వారా తమ పబ్బం గడుపుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోందని, అందుకు వైసీపీ సహకరిస్తోందని, మరో ఎండ్ నుండి జనసేన కూడా తమ చేయి అందిస్తోందని ఇటీవల కాలంలో టిడిపి నేతలు చేస్తోన్న ఆరోపణలు తెలియనివి కావు. ఒకానొక సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీటిని బలపరిచారు.
అయితే చంద్రబాబుపై ఎదురుదాడి చేస్తోన్న ప్రత్యర్ధి వర్గాలు ఆ విమర్శలను అలాగే కొనసాగిస్తుండగా, టిడిపి ఆరోపణలకు తాజాగా బలం చేకూరే అంశం రమణ దీక్షితులు రూపంలో చోటు చేసుకుంది. ఇటీవలే అమిత్ షాను కలుసుకున్న రమణ దీక్షితులు, ఇప్పుడు జగన్ తో భేటీ కావడం అనేది ఏపీ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామంగా భావించాలి. రమణ దీక్షితులు రూపంలో అమిత్ షా జగన్ కు సందేశం పంపారా? అన్న అనుమానం సహజంగానే కలుగుతుంది. వీటన్నిటి కంటే టిడిపి ఆరోపణలకు ఒక సాక్ష్యం లభించినట్లయ్యింది.
తాము చేస్తున్నవి గాలి మాటలు కాదు, ఏపీలో బలమైన రాజకీయ కుట్ర జరుగుతోందన్న భావాన్ని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్ళిన టిడిపి నేతలకు ఇది ఊరట చెందే పరిణామమే అయినప్పటికీ… ఇంతకీ రమణ దీక్షితులు చేరవేసిన సందేశం ఏంటా? అన్న కోణంలో టిడిపి వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. చంద్రబాబుకు అధికారం దూరం చేయాలని బిజెపి – వైసీపీ – జనసేన కృషి చేస్తుంటే… మోడీని ప్రజలు పక్కన పెట్టాలని చంద్రబాబు ఒంటరి పోరు సాగిస్తున్నారు. మరి ఇందులో విజేతలుగా ఎవరు నిలుస్తారో, ఇద్దరూ నిలుస్తారో తెలియాలంటే మరో ఏడాది వరకు వేచిచూడాల్సిందే.



