‘చావు కబురు చల్లగా చెప్పడమంటే’ ఏంటో తమ వినియోగదారులకు జియో రుచి చూపించింది. మార్చి 31వ తేదీన చాలామంది వినియోగదారులకు ప్రైమ్ మెంబర్ షిప్ ను చేయించుకోవడానికి వెబ్ సైట్ అందుబాటులో లేకపోవడంతో, సదరు గడువు తేదీని పొడిగిస్తూ… ఏప్రిల్ 15వ తేదీ లోపున ప్రైమ్ మెంబర్ షిప్ తో పాటు కనీసం 303 రూపాయల రీ చార్జ్ చేయించుకున్నట్లయితే మూడు నెలల పాటు ‘సమ్మర్ స్పెషల్ ఆఫర్’కు ఎలిజిబుల్ అంటూ జియో అధికారిక ప్రకటన చేసింది.
దీంతో వినియోగదారులంతా మరోసారి సంబరాలు చేసుకున్నారు. అయితే గడువు తేదీకి ఇంకా వారం రోజుల పాటు సమయం ఉందన్న నేపధ్యంలో… కస్టమర్లకు షాక్ ఇస్తూ… ‘సమ్మర్ స్పెషల్ ఆఫర్’ను రద్దు చేసింది. ట్రాయ్ నిబంధనల మేరకు ‘సమ్మర్ స్పెషల్ ఆఫర్’ను రద్దు చేస్తున్నామని, అయితే ఈ రద్దుకు ముందు వరకు 303 రూపాయలతో రీ చార్జ్ చేయించుకున్న వాళ్ళందరికీ సమ్మర్ ఆఫర్ వర్తిస్తుందని చెప్పింది. అయితే ఇక్కడే ఓ చిక్కుముడి కూడా జియో ప్రకటించింది.
ట్రాయ్ ప్రకారం ఈ ఆఫర్ ను రద్దు చేస్తున్నామని ప్రకటించింది గానీ, అది ఎప్పటినుండి రద్దు చేస్తుందో అనేది స్పష్టత ఇవ్వలేదు. రాబోతున్న కొన్ని రోజుల్లో ఈ ఆఫర్ ను తొలగిస్తామని మాత్రమే చెప్పడంతో, ఇప్పుడు రీ చార్జ్ చేస్తే సమ్మర్ ఆఫర్ వస్తుందా? రాదా? అన్న సందేహంలో జియో వినియోగదారులు కొట్టుమిట్టాడుతున్నారు. దీనిపై జియో కేర్ కూడా స్పష్టత ఇవ్వలేకపోతోంది. కానీ, ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రైమ్ మరియు సమ్మర్ ఆఫర్ కు గడువు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.



