తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇటీవలే పాక్షికంగా మొదలు పెట్టారు. అయితే మేడిగడ్డ, కన్నెపల్లి బారేజీల నుంచి ప్రభుత్వం లిప్ట్ చేసిన నీరు అంతా వృధా అయిందని వార్తలు వస్తున్నాయి. గోదావరి నీటిని దిగువ నుంచి ఎగువకు… మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం వరకు లిఫ్ట్ చేసిన నీరంతా వరదలో కొట్టుకుపోయింది. వరుసగా కురిసిన వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహించింది. మానేరు నది నుంచి వరద రావటంతో అన్నారం బ్యారేజీలో నిల్వ చేసిన నీటికి ప్రభుత్వం గేట్లు తెరిచింది.
ఇప్పటివరకు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి నిల్వ చేసిన నీటిని దిగువకు వదిలేసింది. ఈ నీరంతా వరదగా మారి మేడిగడ్డ వైపు పరవళ్లు తొక్కింది. ఇప్పటికే ప్రాణహిత దూకుడుతో కాళేశ్వరం సమీపంలో గోదావరి ఉప్పొంగుతోంది. ఇన్ని రోజులుగా చేసిన ప్రయత్నమంతా వరద పాలైందని ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. ఈనెల 30 నుంచి శనివారం వరకు అయిదు రోజుల్లోనే దాదాపు 196 టీఎంసీల నీరు మేడిగడ్డ బ్యారేజీ దాటి వృథాగా పోయిందని అధికారులు అంచనా వేశారు.
ఇరవై రోజుల్లో కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల మూడు పంప్హౌస్ల ద్వారా 12 టీఎంసీల గోదావరి నీటిని ప్రభుత్వం ఎత్తిపోసింది. భారీ మోటర్లను నడిపేందుకు దాదాపు 30 కోట్లు కరెంటు బిల్లు అయ్యింది. అయిదు రోజులుగా కురిసిన వర్షాలతో సీన్ రివర్సయింది. దీనితో ప్రభుత్వం అభాసుపాలు అయ్యింది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాకా కూడా ఇటువంటివి జరిగితే నష్టం భారీగా ఉంటుంది. అయితే ప్రకృతిని ఎవరు మాత్రం కట్టడి చెయ్యగలరు?



