ఒకప్పుడు ప్రముఖుల విగ్రహాలను దేశ ప్రజలు ఎంతో గౌరవంతో ఏర్పాటు చేసుకునేవారు. ఆ తర్వాత ప్రజల ఆకాంక్షలను అర్దం చేసుకుని ప్రభుత్వాలే విగ్రహాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి.
కానీ కాలక్రమంలో రాజకీయ, సామాజిక కారణాలతో విగ్రహాల ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రముఖుల స్పూర్తితో వారి ఆశయాలు, సిద్దాంతాలను పాటిస్తూ వారి అడుగుజాడలలో నడవడం కంటే వారి విగ్రహాలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోవడం మొదలుపెట్టారు.
ఏపీలో ప్రతిపక్షాలపై కేసులు నమోదు చేస్తూ, ఓటర్ల జాబితాలలో అవకతవకలకు పాల్పతూ జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించని రోజే లేదు.
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటున్నారు!
అంబేడ్కర్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వీరిద్దరూ పోటాపోటీగా వందల కోట్లు ఖర్చు చేసి డా.అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాలను ఎందుకు ఏర్పాటు చేశారు?అంటే వారిపై గౌరవంతోనా? అంటే కాదని, బడుగు బలహీన వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకే అని అందరికీ తెలుసు.
ఈ విగ్రహాల ఏర్పాటుకి మరో కారణం, కోణం కూడా ఉంది. తెలంగాణ సచివాలయం సమీపంలో ఆ రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఏర్పాటు చేయడం గురించి చెప్పుకోవచ్చు.
రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్లు పరిచయం చేసి ఐటి, టెలికాం రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారనేది వాస్తవం. ఇందిరా గాంధీ మరణం తర్వాత అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో ఎల్టీటీఈ తీవ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. భారత్కు ఇది చాలా బాధాకరమైన విషయమే.
అయితే ఇక్కడ పాయింట్ అది కాదు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియామకంలో కాంగ్రెస్ అధిష్టానం అన్నివిధాలా తోడ్పడిన సంగతి అందరికీ తెలుసు. అయితే నేటికీ ఆయన పదవికి, ప్రభుత్వానికి పార్టీలో అంతర్గతంగా, బయట కేసీఆర్ నుంచి గండం పొంచే ఉంది. కనుక కాంగ్రెస్ అధిష్టానం మద్దతు చాలా చాలా అవసరం. కనుక సోనియా, రాహుల్ గాంధీలను ప్రసన్నం చేసుకోవడానికి ఇటువంటివి చేయక తప్పదు.
విగ్రహాల ఏర్పాటుకి మరో కారణం కూడా ఉంటుంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ప్రయత్నంగా కూడా చోడవచ్చు. ఓ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపేందుకు ఎక్కడికక్కడ తమ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటాయి. పార్టీ జెండా దిమ్మెలు, పార్టీ రంగులు, పేర్లు పెడుతుండటం ఏపీ అంతటా కనిపిస్తూనే ఉంది.
ఈ ప్రయత్నంలో చిట్ట చివరి దశ మరొకటి ఉంది. రాష్ట్రమంతా ముఖ్యమంత్రి ఫోటోలు, బ్యానర్లు పెట్టడం. జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టుకోవడం, ఇళ్లకు స్టిక్కర్స్ అంటించడం కూడా దీనిలో భాగమే. ప్రజలకు మేమున్నామని గుర్తు చేసేందుకు, రాజకీయ ప్రత్యర్ధులకు ‘ఇది మా అడ్డా… నో ఎంట్రీ’ అని చెప్పేందుకు.
ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది కనుక రాష్ట్రమంతా ఇందిరమ్మ, రాజీవ్ విగ్రహాలు ఏర్పాటు చేస్తే పెద్ద విచిత్రం కాదు.




