రాష్ట్ర ప్రజలు తమకు అధికారం ఇచ్చింది తమ నిర్ణయాలను వ్యతిరేకించిన ప్రతివారి పై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లకు పంపడానికా అన్నట్లుగా అందరిపై బెlరింపు కేసులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు జగన్ అండ్ కో.స్వయానా ముఖ్యమంత్రి జగనే బటన్ నొక్కడం తప్ప తానూ మరేం చెయ్యలేను అంటూ సెలవివ్వడంతో ఇక రాష్ట్ర సమస్యలతో మాకేం పనిలే అన్నట్లు వైసీపీ మంత్రులు, ఆ పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేతలను కించపరచడం,కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం అంటూ బెదించడంతోనే విలువైన నాలుగున్నరేళ్ల రాష్ట్ర సమయాన్ని వృధా చేసారు.
చంద్రబాబు అరెస్టుతో నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే కార్యక్రమంతో ప్రజలలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను ఎక్కడ ప్రతిపక్ష పార్టీలు అందిపుచ్చుకుంటాయో అనే కంగారులో నోటికి వచ్చిందల్లా మాట్లాడండంలో మంత్రి రోజాది మొదటి స్థానం. ఇప్పటికే అవినీతి కేసులో అరెస్టయిన బాబుకి మద్దతుగా భువనేశ్వరి చేస్తున్న యాత్ర నిజం గెలవాలి మాదిరే నిజంగా నిజం గెలిస్తే చంద్రబాబు జీవితకాలం జైలులోనే గడపాల్సి వస్తుందని, ఆయనకు తోడు లోకేష్, భువనేశ్వరి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందంటూ “జగన్ భవిష్యవాణిని” వినిపించారు రోజా.
రాష్ట్రంలో 2024 ఎన్నికలలో జగనన్న వన్స్ మోర్ అంటూ ప్రజలు తీర్పు ఇవ్వనున్నారంటూ రానున్న ఎన్నికల ఫలితాలను కూడా ఇప్పుడే చెప్పేస్తున్నారు మంత్రి గారు. అయితే అదే భవిష్యవాణిని ఉపయోగించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుంది, పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది, మూడు రాజధానుల నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది,చివరిగా జగన్ బెయిలు ఎప్పుడు రద్దవుతుందో కూడా కాస్త చూసి చెపితే బాగుంటుందంటూ టీడీపీ నేతలు రోజాకు ఘాటు సమాధానమే ఇచ్చారు.
ఉదయం ఎక్ససర్ సైజులు, మధ్యాహ్నం నాన్ వెజ్ భోజనం,రాత్రికి పార్టీలు తప్ప నువ్వు రాష్టానికి చేసిందేమిటో చెప్పాలంటూ టీడీపీ మహిళా ఎమ్మెల్సీ అనురాధ రోజా పై ఫెయిర్ అయ్యారు. భువనేశ్వరి గారిని జైలుకు పంపిస్తాను అంటూ వ్యాఖ్యానించడం నీ స్థాయికి తగదు అంటూ రోజాను హెచ్చరించారు. అయినా ఇలా ఎవరు యాత్రలు చేపట్టినా, ఎవరు బహిరంగ సభలు నిర్వహించిన, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించిన, ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఎవరు స్పందించినా, కనీసం సామజిక మాధ్యమాలలో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క పోస్టు పెట్టిన, పోస్టును షేర్ చేసిన కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తాం అంటే ఇక రాష్ట్రానికి మూడు రాజధానులు కాదు ,పరిశ్రమలు కాదు జైళ్లే నిర్మించాలి.
బాబుకి మద్దతుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఇప్పటికే మోతమోగిద్దాం, క్రాంతితో కాంతి, నిజాయితీకి సంకెళ్లు, జగనాసుర దహనం వంటి కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో విజిల్ వేసినా, చేతిలో కొవ్వొత్తు పట్టుకున్నా,తమ చేతికి తామే సంకెళ్లు వేసుకున్న టీడీపీ కార్యకర్తల పై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందంటూ లోకేష్ ఇతివరకే వెల్లడించడం జరిగింది.జనసేన నేతలది, జనసైనికులది ఇదే పరిస్థితి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు కదా తమ నేతకు మద్దతుగా పోస్టర్లు పెట్టిన కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు జనసైనికులు.
బాబు అరెస్టుతోనే టీడీపీ నేతల అరెస్టులు మొదలయ్యినాయి ఇక రానున్నకాలంలో టీడీపీ ముఖ్య నేతల పై, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి లపై కూడా కేసులు పెట్టి జైలుకు పంపడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ రోజా పదేపదే చెప్పి టీడీపీ నేతలను మానసికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తుందని, అటువంటి తప్పుడు విమర్శలతో వైసీపీ తన ఫ్యాన్ కు తానే ఉరేసుకున్నట్టే అంటూ రోజా విమర్శలను తిప్పకొడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అయినా ఇలా ప్రతి వారి పై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపిస్తే రాష్ట్రానికి కావాల్సింది ముఖ్యమంత్రి మంత్రులు కాదు.పోలీస్ సిబ్బంది, జైలు అధికారులు మాత్రమే అని రోజాకు ఎప్పుడు అర్ధమవుతుందో!




