“ఫిదా” సినిమాతో ఎంత బాగా పాపులర్ అయ్యిందో, ఆ తర్వాత షూటింగ్ కు ఆలస్యమవుతూ చుక్కలు చూపిస్తోందన్న టాక్ తో ట్రేడ్ వర్గాలలో సాయిపల్లవి పేరు బాగా హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – నానిల “ఎంసీఏ” సినిమాకు ఇలా వ్యవహరిస్తోందని, అందుకే దిల్ రాజు తన తదుపరి చిత్రానికి సాయిపల్లవిని పక్కన పెట్టేసినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే సదరు “ఎంసీఏ” సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానున్న నేపధ్యంలో… ప్రమోషన్ లో పాల్గొన్న దిల్ రాజు సదరు అంశంపై స్పష్టత ఇచ్చారు. సాయిపల్లవి షూటింగ్స్ కు ఆలస్యంగా వస్తోందన్న సమాచారం తనవరకు వచ్చిన మాట వాస్తవమే గానీ, నిజానికి అలాంటిదేమీ జరగలేదని, నిర్ణీత సమయానికే షూటింగ్ కు వచ్చేదని సాయిపల్లవి పద్ధతిని సర్టిఫై చేసేసారు.
నిజానికి ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా కధ కూడా సాయిపల్లవి వినలేదని అన్నారు దిల్ రాజు. ఈ ‘హైబ్రిడ్ పిల్ల’ తొలి సినిమా “ఫిదా” ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజే కావడంతో… సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న రాజు గారి మాటలకు అటు ట్రేడ్ వర్గాలతో పాటు, ఇటు సినీ ప్రేక్షకులలోనూ కొంత విశ్వసనీయత ఉంది. ఒకవేళ రాజు గారి చెప్పిందే వాస్తవమైతే, “శ్రీనివాస కళ్యాణం” కధ పల్లవికి ఎందుకు వినిపించనట్లు? అని ప్రశ్నించే వారు లేకపోలేరు.



