తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి మరికొన్ని రోజులలో ముగియనుండడంతో ఇక ఆంధ్రాలో ఈ ఎన్నికల కోలాహలం మొదలవనుంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన అందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు ఎవరికీ వారు ధీమాగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సకల శాకా మంత్రి సజ్జల మాట్లాడుతూ ఏపీలో మూడు నాలుగు నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు వైసీపీ పార్టీ అన్ని విధాలా సిద్ధంగా ఉంది అంటూ చెప్పారు.
అలాగే ఈ ఎన్నికల పోటీలో ఏపీలో ప్రజలకు పెద్దగా అప్షన్లు లేవని అయితే చంద్రబాబు లేకుంటే జగన్ ఇద్దరే ముఖ్యమంత్రి పోటీలో ఉన్నారని, వైసీపీ, టీడీపీ ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ను తాము లెక్కలోకి తీసుకోవడంలేదని, ఆయనకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడే ఉద్దేశం లేదని ఆయన ప్రయత్నాలు అన్ని చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికే ఉపయోగిస్తారని అందువలన పవన్ పోటీలో లేరంటూ వ్యాఖ్యానించారు సజ్జలగారు.
ఇటువంటి వ్యాఖ్యలు చేసి జనసేన నాయకులను, జనసైనికులను, పవన్ అభిమానులను టీడీపీ పార్టీకి దూరం చేయాలనీ సజ్జల గారు బాగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసలు పవన్ పోటీలోనే లేరు అని భావిస్తున్న వైసీపీ నేతలు దమ్ముంటే జనసేన పార్టీని ఒంటరిగా పోటీ చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమెలా?పవన్ కు ఓటు బ్యాంకే లేదని చెపుతున్న సజ్జల పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఏమవుతుందో, టీడీపీతో కలిసి పోటీ చేస్తే తేడా ఏమొస్తుందో కూడా చెపితే బాగుండేది. అసలు పోటీలోనే లేరనే వ్యక్తి మీద విమర్శలు చేయడానికి పోటీపడి మరి మీడియా ముందుకు వస్తున్న నాయకులు ఏ పార్టీకి చెందినవారో ఒక్కసారి సలహాదారు సరిచూసుకుంటే బాగుండేది.
నిన్నటి వరకు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు, అక్రమంగా ప్రజల సొమ్ముని దోచేసిన దొంగ చంద్రబాబు, ఆయన మీద ఏపీ ప్రజలకు నమ్మకం పోయింది రానున్న ఎన్నికలలో 175 కి 175 స్థానాలు వైసీపీ పార్టీనే గెలుచుకుంటుంది. కుప్పం ప్రజలు కూడా వైసీపీ పార్టీకే మద్దతు తెలుపుతారు అంటూ ముఖ్యమంత్రి వైస్ జగన్ నుంచి వైసీపీ క్యాడర్ వరకు చేసిన గంభీరమైన ప్రకటనలు అంతా సజ్జల వ్యాక్యలతో ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నాలుగా తేలిపోయాయి. వైసీపీ పార్టీకి 175 స్థానాలలో గెలిచే సత్తా ఉన్నప్పుడు జగన్ కు చంద్రబాబు పోటీ ఎలా అవుతాడు? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియని సజ్జల ఇక ప్రభుత్వాన్ని సజావుగా నడపడానికి సలహాలు ఎలా ఇస్తారో ఒక్క సారి ఆలోచించాల్సిన విషయమే.ఇలా మీడియా ముందుకొచ్చి ప్రతిపక్ష పార్టీలను ఇరికించాలి అని చేసే వ్యాఖ్యలతో సొంత పార్టీకే నష్టం తెచ్చే ప్రకటనలు చేస్తూ జగన్ కు సజ్జల చేస్తున్న మంచేమిటో వైసీపీ నేతలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.




