సుప్రీంకోర్టు విధించిన నాలుగేళ్లు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో బెంగళూరుకు చేరుకున్న చిన్నమ్మ పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన కోర్టులో లొంగిపోయారు. దీంతో న్యాయమూర్తి ఆమెను అగ్రహార జైలుకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మరో మూడున్నరేళ్ల పాటు ఇక్కడే శశికళ నటరాజన్ జైలు జీవితం గడపనున్నారు. ఈ నేపథ్యంలో జైలు బయట ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలపై హెల్మెట్లు పెట్టుకొని పలువురు దుండగులు రాళ్లు రువ్వుతూ రెచ్చిపోయారు. ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టినప్పటికీ, ఈ దాడిలో ఆరు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఇక, జైలు లోపలికి వెళ్ళిన అనంతరం శశికళకు ఖైదీ వస్త్రాలు ఇవ్వగా, ఖైదీ నెంబర్ 9234 ను కేటాయించారు. అలాగే మరో సహ నిందితురాలు, ఆమె వదిన అయిన ఇళవరసికి ఖైదీ నెంబర్ 9235ను కేటాయించగా, సుధాకరన్ కు 9236 నెంబర్ ను కేటాయించారు. కాకుంటే ఆయనకు కూడా పురుషుల జైలులో నెంబర్ కేటాయిస్తారు. శశికళ కోరిన ఏసీ రూం, టీవీ, ఇంటి భోజనం, పని మనిషి తదితర కోరికలను న్యాయమూర్తి నిర్ద్వంద్వందంగా తోసిపుచ్చడంతో, శశికళకు మరో షాక్ తగిలింది. జయలలిత నెచ్చెలిగా దశాబ్దాల పాటు రాజభోగాలు అనుభవించిన శశికళ, సుప్రీంకోర్టు తీర్పుతో మొత్తం తల్లకిందులైంది.
ఇద్దరు ఖైదీలతో కలిసి ఉండేలా మూడో వ్యక్తిగా బ్యారక్ లో గదిని ఆమెకు కేటాయించారు. అనంతరం సాధారణ ఖైదీల మాదిరే ఆమెకు ఆహారం అందించారు. ఇకపై కూడా శశికళకు ఆమె ప్రతిరోజూ ఇదే రకమైన ఆహారం అందించనున్నారు. రాత్రి భోజనంగా ఆమెకు రెండు చపాతీలు, 200 గ్రాముల అన్నం లేదా రాగిముద్ద, 150 మిల్లీ లీటర్ల సాంబారు ఇచ్చారు. అలాగే రోజూ 50 రూపాయల వేతనంతో పని చేయాలని సూచించగా, పనిని ఎంచుకునే సౌలభ్యం ఆమెకే కల్పించారు. మరో ట్విస్ట్ ఏమిటంటే… తనకు అనారోగ్యం ఉంది… మరో నాలుగు వారాల పాటు గడువు కావాలని కోరిన శశికళకు జైలులో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు గానీ, ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడం విశేషం.


