
రాష్ట్రాలు ఎస్సీ,ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ముందుగా తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చింది. కానీ దాని కోసం ప్రభుత్వం అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది.
రాష్ట్రంలో ఏయే కులాల జనాభా ఎంత ఉందో తెలుసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సమగ్ర కుల సర్వే చేయించగా, దానిలో బీసీ జనాభాని తక్కువగా చూపించారని ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ఆందోళనలు చేశాయి. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆ సర్వే నివేదికని చించి నిరసన తెలియజేయడంతో ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Also Read – అమరావతిలో భూకేటాయింపులు…
మొదటి సర్వేపై అనుమానాలు వ్యక్తం అవడంతో మళ్ళీ రెండోసారి సర్వే చేయించి మొదటిసారి వివరాలు నమోదు చేయని బీసీలని గుర్తించి నమోదు చేయాల్సి వచ్చింది. బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు వారి రిజర్వేషన్స్ 42 శాతానికి పెంచుతూ శాసనసభలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది.
సమగ్ర కుల నివేదిక, ఎస్సీ వర్గీకరణ కొరకు వేసిన కమిటీ నివేదిక ఆధారంగా శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టి తదనుగుణంగా రిజర్వేషన్స్ ప్రకటిస్తే, వాటి వలన తమకు అన్యాయం జరుగుతోందంటూ ఎస్సీలో కొన్ని ఉప కుల సంఘాలు ఆందోళనలు చేశాయి. కనుక తెలంగాణ ప్రభుత్వం ఒక్కో సమస్యని అధిగమిస్తూ మెల్లగా ముందుకు సాగాల్సి వచ్చింది.
Also Read – భారత్, పాక్లకు యుద్ధం అవసరమే?
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలపై కుల ప్రభావం చాలా ఎక్కువ. అలాగే తెలంగాణతో పోలిస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ జనాభా కూడా ఎక్కువే. కనుక ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ చేపట్టడం అంటే తేనె తుట్టెని కదిపిన్నట్లే అవుతుందని పలువురు భావించారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆచితూచి ముందుకు సాగడంతో పెద్దగా సమస్యలు ఎదుర్కోకుండానే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని పూర్తి చేసింది. తదనుగుణంగా ఉప కులాలకు రిజర్వేషన్స్ కూడా ప్రకటించింది.
Also Read – ముగిసిన శకం..చెరపలేని జ్ఞాపకం..!
ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్సీ వర్గీకరణకు సంబందించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలు ఉన్నాయి. వారిని వెనుకబాటుతనం ఆధారంగా మూడు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో 12 ఉప కులాలకు 1 శాతం, రెండో గ్రూపులో 18 ఉపకులాలకు 6.5 శాతం, మూడో గ్రూపులో 29 ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్స్ కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో పాటు 1-100, 101-200 వరకు రెండు సైకిల్స్లో రోస్టర్ పాయింట్స్ కూడా అమలు చేయబోతున్నారు.