పిల్లలను ఆదర్శవంతమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గల ఉపాధ్యాయులు, తమపై ఉన్న అపారమైన ఆ బాధ్యతను మరచి వికృత పోకడలకు పోతున్నారు. విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లొంగదీసుకోవాలని చూస్తున్నారు. ఇటువంటి దారుణ ఘటనే బెంగళూరులో మరొకటి చోటు చేసుకుంది. నగరంలోని సదాశివనగర్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ కుమార్ ఠాకూర్ విద్యార్థినులకు చెబుతున్న పాఠాల గురించి వింటే ఆడపిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించాలన్నా భయపడతారేమో!
12వ తరగతి విద్యార్థిని ఒకరు ధైర్యం చేసుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో తమ గురువు ఠాకూర్ ఓ బాయ్ ఫ్రెండ్ ని ఉంచుకోవాలని అంటున్నాడని, నటి సన్నీ లియోన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నాడని విద్యార్థిని చెప్పింది. తనతో ఆ ఉపాధ్యాయుడు సెక్స్ టాయ్స్ ని వాడుతూ ఉండాలని చెప్పాడని, తనను తరచూ కలుస్తూ ఉండాలని చెప్పాడని పేర్కొంది. తాను చెప్పినట్లు చేస్తే తనకు అన్ని విధాలుగా సాయం చేస్తానని ఠాకూర్ చెప్పాడని ఆమె చెప్పింది.
చెప్పినట్లు వినకపోతే ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చే అన్ని అవకాశాలను నువ్వు కోల్పోతావని బెదిరించాడని తెలిపింది. కాగా, గత డిసెంబరులోనూ సదరు టీచర్ ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయగా, ఇప్పుడు అతను బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. దీనిపై స్పందించిన నోడల్ చైల్డ్ లైన్ డైరెక్టర్ వాసుదేవ శర్మ గత నెల 25న సెంట్రల్ డివిజన్ డీసీపీ చంద్రగుప్తకు లేఖ రాస్తూ, సదరు ఉపాధ్యాయుడికి మంజూరు చేసిన బెయిలును రద్దు చేయించాలని కోరారు.



