శేఖర్ కమ్ముల సినిమాలంటే వీక్షకులకు ‘మంచి కాఫీ లాంటి సినిమా’ అన్న అనుభూతి కలగడం సహజమే. అలాగే శేఖర్ సినిమాలలో హీరోయిన్లకు ఉండే ప్రాముఖ్యత తెలియనిది కాదు. మరి ఈ నెల 21వ తేదీన విడుదల కాబోతున్న “ఫిదా” సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయిపల్లవి పాత్ర ఎలా ఉండబోతుంది? అని శేఖర్ ని అడిగితే… కొన్ని సంవత్సరాల పాటు ఖచ్చితంగా గుర్తుండిపోయే పాత్ర ఇదని పూర్తి విశ్వాసంతో చెప్పారు.
తెలంగాణాకు – యుఎస్ కు సంబంధించిన నేపధ్యంలో సాగే కధ ‘ఫిదా’ అని చెప్పిన కమ్ముల, హీరోయిన్ తెలంగాణాకు చెందిన అమ్మాయి కావడంతో, ‘బాడ్కావ్’ అనే పదం ఎక్కువ వినియోగిస్తుందని, అయితే ఆ తర్వాత సెన్సార్ ఈ పదాన్ని అంగీకరించబోదని తెలిసి, డబ్బింగ్ లో దానిని ‘బద్మాష్’ అని మార్చామని, లిప్ సింక్ లో చూస్తే మీకు ‘బాడ్కావ్’ అనే సాయిపల్లవి అంటుందని, తెలంగాణాలో చాలామంది అమ్మాయిలు దీనిని పలకడం తాను విన్నానని, అందుకే ఈ పదం పెట్టానని చెప్పుకొచ్చారు.
మొదటి సినిమాతోనే డబ్బింగ్ చెప్పడం అందరి వల్ల అయ్యే పని కాదని, కానీ సాయిపల్లవి అద్భుతంగా చెప్పిందని, ఈ సినిమాను ‘డాటర్స్’ (కూతుళ్ళందరూ) బాగా ఇష్టపడతారని అన్నారు. అలాగే హీరో పాత్రలో చాలా స్వచ్ఛత ఉంటుందని, ఇలాంటి సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యిందని, ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న సినీ ఇండస్ట్రీలో “ఫిదా” ఖచ్చితంగా ‘పైసా వసూల్’ సినిమాగా నిలుస్తుందని, ఇందులో తనకే మాత్రం సందేహం లేదని, అందరూ హాయిగా వచ్చి చూసేళ్లిపోవచ్చని అభయమిచ్చారు శేఖర్ కమ్ముల.



