అప్పుడే సెప్టెంబర్ నెల కూడా వచ్చేసింది. ఈ నెలలో అప్పుడే 5 రోజులు గడిచిపోయాయి కూడా. కానీ నేటికీ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. ఎండ లేకపోయినా ఉష్ణోగ్రతలు 32-35 డిగ్రీలు ఉంటోంది. కనుక నేటికీ ఇళ్ళలో ఏసీలు నడుస్తూనే ఉన్నాయి.
ఓ పక్క గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, వారణాశి, కాశ్మీర్లో అకస్మాత్తుగా భారీ వర్షాలు పదుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మన పొరుగు రాష్ట్రంలో హైదరాబాద్తో సహా పలు ప్రాంతాలలో అడపాదడపా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో రాత్రిపూట చలి కూడా ఉంటోంది.
ఇదంతా ‘ఎల్ నినో’ ప్రభావమే అంటున్నారు వాతావరణ నిపుణులు. లేకుంటే జూన్ నెలలో వానలు మొదలై ఈ పాటికి కొనసాగుతూ లేదా ముగుస్తూ ఉండాలి.
కానీ ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వలన వర్షాభావ పరిస్థితి, అకాల వర్షాలు, తీవ్రమైన ఎండ, ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ ముందే చెప్పింది. ‘ఎల్ నినో’ ప్రభావం ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల వరకు ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
కనుక దీని ప్రభావం వచ్చే ఏడాదికి కూడా విస్తరించి, రాష్ట్రంలో నీటి కొరత. దాని కారణంగా పంటలు పండక నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం కూడా ఉండవచ్చు. కనుక చేతులు కాలాక ఆకులు పట్టుకొని బాధపడే కంటే రాష్ట్ర ప్రభుత్వం తాగు,సాగు నీటి భద్రతకు ఇప్పటి నుంచే గట్టి చర్యలు చేపట్టడం చాలా అవసరం.





