రామ్ చరణ్ కూడా అయ్యప్ప మాల వేస్తాడు. ఆ ఒక్క కారణంతో ఇరుముడిలో ఆయన అతిథి పాత్ర చేస్తున్నాడనే ప్రచారం మొదలైంది. మల్లెపూల పల్లకి పాటలో కనిపిస్తాడంటూ చెప్పుకొచ్చారు. సినిమా విడుదలయ్యాక అదంతా ఆధారం లేని రూమరేనని తేలిపోయింది.
ఇప్పుడు ఇరుముడి సీక్వెల్లో రామ్ చరణ్ ఉండే అవకాశం ఉందా అనే ప్రశ్న శివ నిర్వాణకు ఎదురైంది.
ఇక్కడ ముందుగా దర్శకుడిని ఒక విషయంలో అభినందించాలి. ఇరుముడి 2 ఉండదని స్పష్టంగా చెప్పేశాడు.
ఇరుముడి సహజంగా కుదిరిన సినిమా అని, డబ్బుల కోసం దాన్ని మరో పార్ట్కు సాగదీయాలనుకోవడం లేదని వివరించాడు.
నిజానికి ఇరుముడి కథలో కొనసాగించడానికి ఏమీ లేదు కూడా.
అయితే ఈ రోజుల్లో బిజినెస్ కోసం మరో పార్ట్ తీయాలనుకుంటే, కథ లేకపోవడం పెద్ద అడ్డంకి కావడం లేదు. అలాంటప్పుడు ఇక్కడితో ఆపేస్తామని చెప్పడం మంచి విషయమే.
ఇక చరణ్ ప్రస్తావనలోనే అసలు లాజిక్ లేదు.
రవితేజ ఇప్పటికే ఇరుముడితో తనదైన ముద్ర వేశాడు. అలాంటి సినిమాకు సీక్వెల్లో నటించడానికి రామ్ చరణ్ ఎందుకు ఒప్పుకుంటాడు?
ఒకవేళ కథను కొనసాగించే అవకాశం ఉన్నా, రవితేజతో పోలికలు వచ్చే సినిమాను ఆయన ఎందుకు ఎంచుకోవాలి?
సీక్వెలే లేదని దర్శకుడు చెప్పిన తర్వాత కూడా చరణ్ పేరు చుట్టూ చర్చ జరుగుతోంది. ఆయన కూడా అయ్యప్ప మాల వేస్తాడన్న ఒక్క కారణం తప్ప, ఈ చర్చకు మరో ఆధారం లేదు, సిల్లీ!




