పంచ్ డైలాగులకు చప్పట్లు, రిటర్న్ గిఫ్టులు… ఛాయిస్ మీదే!

KTR Jagan Harsh Words Politics

రాజకీయ నాయకులు సభలో రంకెలు వేస్తూ అవి తమ ధైర్యానికి, వాక్చాతుర్యానికి నిదర్శనమని అనుకుంటారు. కనుక సినిమాలలో హీరోల పంచ్ డైలాగ్స్ విని అభిమానులు ఉత్సాహంతో ఈలలు వేసినట్లే, సభలలో నేతలు ఆవేశంతో రంకెలు వేసినప్పుడూ ప్రజలు చప్పట్లు కొడతారు.

సినిమాలలో పంచ్ డైలాగులు ఏవిధంగా పాపులర్ అయ్యి శాశ్వితంగా రికార్డ్ అవుతాయో. అదేవిధంగా రాజకీయ నాయకులు అదుపు తప్పి మాట్లాడే ప్రతీ మాట.. మీడియాలో, ప్రజల మనసులలో రికార్డ్ అవుతూనే ఉంటుంది. భవిష్యత్‌లో అవే వారిని కర్ణుడి శాపాల్లా వెంటాడి ఓడిస్తాయి.

ADVERTISEMENT

నాడు కేసీఆర్‌, జగన్‌ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తమ ప్రత్యర్ధులను ఉద్దేశ్యించి చాలా అవహేళనగా మాట్లాడేవారు.

అప్పుడు వారి ప్రతీ డైలాగుకి చప్పట్లు బాగానే పడ్డాయి. కానీ ఆ దురహంకార మాటలే వారి పాలిట శాపాలుగా మారి ఒకరిని ఫామ్‌హౌసులో మరొకరిని తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చోబెట్టాయి.

ప్రజలు తమ పదవీ, అధికారం ఊడగొట్టినా, ఇక్కడ జగన్‌, వైసీపీ నేతల మాట తీరు మారలేదు. అక్కడ కేటీఆర్‌ మాట తీరు మారలేదు.

తనకంటే వయసులో చాలా పెద్దవారైన చంద్రబాబు నాయుడుని ‘ముసలోడు… బీపీ వచ్చి పోతాడు… ఎంతకాలం బ్రతికి ఉంటాడో తెలీదు..” అంటూ చాలా అవమానకరంగా మాట్లాడుతారు.

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా? కనుక వైసీపీ నేతలు… వారిని చూసి కార్యకర్తలు కూడా ‘రప్పా రప్పా’ అంటూ రెచ్చిపోతూనే ఉన్నారు.

అక్కడ తెలంగాణలో నేడు కరీంనగర్‌లో జరిగిన ఓ సభలో సిఎం రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ మంత్రులను, వారి పార్టీని ఉద్దేశ్యించి, “బట్టేబాజ్, ధోకేబాజ్, లఫంగా పార్టీ, బకాసురుల్లాగా మేస్తున్నారు. కుంభకర్ణుల్లాగా పండుతున్నారు. పందికొక్కుల్లాగా తింటున్నారు,“ అంటూ కేటీఆర్‌ చాలా దారుణంగా విమర్శించారు.

“ఈ రేవంత్ రెడ్డికి ఒక్క అక్షరం ముక్క రాదు. కాగితం మీద ఏదైనా ఒక దరఖాస్తు వ్రాయగలడా?” అంటూ ఈసడించారు. అందుకు చప్పట్లు పడ్డాయి. సంతోషం.

కానీ ఇదివరకు తాము ఈవిధంగా అనుచితంగా మాట్లాడినందుకే, అక్కడ తెలంగాణలో ఐటి ఉద్యోగులు, అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్ళు ఇక్కడ ఏపీలో వారికి వ్యతిరేకంగా పనిచేసి గద్దె దించారు. ఈ విషయం కేటీఆర్‌, జగన్‌ ఇద్దరికీ బాగా తెలుసు. కానీ నేటికీ వారి మాటలు ఇంకా పదునెక్కుతూనే ఉన్నాయి. అన్ని గీతలు దాటుతూనే ఉన్నాయి.

చివరిగా ఒక మాట. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే నానుడి ఊరికే పుట్టలేదు. కేటీఆర్‌, జగన్‌, వారి పార్టీలకు కూడా ఇదే వర్తిస్తుంది.

తాము చెప్పదలచుకున్న విషయాలనే, చేయాలనుకున్న విమర్శలనే పద్దతిగా, హుందాగా చేస్తే ప్రజలు వాటితో కనెక్ట్ అవుతారు. ఆలోచిస్తారు. కానీ పంచ్ డైలాగులు కొడితే చప్పట్లు కొట్టి రిటర్న్ గిఫ్టులు ఇస్తుంటారు. ఏది కావాలో వారే నిర్ణయించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories