ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పన్ను ఎగవేతదారులపై ఎంత సీరియస్ గా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇదంతా చిన్న చిన్న వాళ్ళ పైనే, బడా బాబుల జోలికి వెళ్ళలేరు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో… కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఓ నివేదిక బయట పెట్టింది. దేశంలో జరిగే అవకతవకలపై ఎప్పటికప్పుడు నివేదికలను అందజేసే కాగ్ వలలో ఈ సారి ఏకంగా టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పడ్డారు.
అవును… ‘యంగ్ టైగర్’ పన్ను చెల్లించే విషయంలో ఓ తప్పు దొర్లిందంటూ ‘కాగ్’ అక్షింతలు వేసింది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై కాగ్ అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాగ్ నివేదికలో జూనియర్ ఎన్టీఆర్ కు సేవా పన్ను మినహాయింపుపై ‘కాగ్’ మండిపడింది.
‘నాన్నకు ప్రేమతో’ సినిమాను విదేశాల్లో షూట్ చేశాము కాబట్టి అది సేవల ఎగుమతి కిందికి వస్తుందని చూపిస్తూ ఎన్టీఆర్ పన్ను ఎగ్గొట్టారని’ కాగ్ తన నివేదికలో పేర్కొంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో నటించినందుకు ఆయన లండన్ కు చెందిన వైబ్రంట్ విజువల్ లిమిటెడ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి 7.33 కోట్ల రూపాయలను 2015లో పారితోషికంగా తీసుకున్నారని కాగ్ వెల్లడించింది. ఇందులో పన్నుగా చెల్లించాల్సిన 1.10 కోట్ల రూపాయలను ఎక్స్ పోర్ట్ ఆఫ్ సర్వీసుగా పరిగణించి పన్ను మినహాయింపునిచ్చారని కాగ్ తెలిపింది.
దీనిపై వివరణ కోరగా జూనియర్ ఎన్టీఆర్ కు షోకాజ్ నోటీసు ఇవ్వనున్నామని ఆర్థిక శాఖ అనుబంధ రెవెన్యూ విభాగం తెలిపింది. ‘నాన్నకు ప్రేమతో’ తరహాలోనే రణ్ బీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మ నటించిన ‘‘ఏ దిల్ హై ముష్కిల్’’ సినిమా కూడా న్యూయార్క్ లో చిత్రీకరించామని చెబుతూ, రణ్ బీర్ 83.43 లక్షల రూపాయల పన్ను మినహాయింపు పొందాడని కాగ్ తెలిపింది. రణ్ బీర్ కు కూడా నోటీసులు జారీ చేయనున్నామని రెవెన్యూ విభాగం తెలిపింది.


