జగన్ ప్రభుత్వం ఆంధ్రాకు కొత్తగా ఒక్క పరిశ్రమని తేలేకపోయినా, తెచ్చి ఉద్యోగాలు కల్పించలేకపోయినా, కనీసం ఉన్నవాటిని కాపాడుకున్నా చాలు. వాటిలో పనిచేస్తున్న కార్మికులు సంతోషించేవారు. కానీ వాటినీ బ్రతకనీయడం లేదు. భారీ, మీడియం స్థాయి పరిశ్రమలకు లంచాల కోసం వివిద విభాగాల అధికారుల వేధింపులు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. వాటికి తోడు వైసీపి నేతల వేధింపులు, కరెంట్ కోతలు లేదా అధనపు చార్జీల బాదుడు భరించక తప్పదు.
ఇక చిన్న చిన్న పరిశ్రమల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. వాటికి చేతినిండా పని దొరక్క తగినంత ఆదాయం ఉండదు. కనుక ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాయి. కరెంట్ కోతలు, కరెంట్ చార్జీల అదనపు బాదుడు, లంచగొండి అధికారుల వేధింపులు సరేసరి.
ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడితే వాటితోనే రాష్ట్రంలో లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి పన్నులు, చార్జీల రూపంలో భారీగా ఆదాయం కూడా లభిస్తుంది. కానీ జగన్ ప్రభుత్వం వాటి నడ్డి కూడా విరుస్తోంది.
చిన్న, మద్య తరహా పరిశ్రమలు అత్యవసర పరిస్థితులలో బ్యాంకుల నుంచి తనకాపై రుణాలు తీసుకుంటాయి. గతంలో ఎంత రుణం తీసుకున్నా మార్ట్ గేజ్ బాండ్ కోసం (స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు కలిపి) రూ.10 వేలు ఛార్జీ చెల్లిస్తే సరిపోయేది.
కానీ ఇప్పుడు తీసుకునే రుణంపై 0.5 శాతం చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ పరిశ్రమ బ్యాంక్ నుంచి కోటి రూపాయలు రుణం తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2.5 లక్షల ఫీజు చెల్లించాల్సిందే. అప్పుడే రిజిస్ట్రార్ కార్యాలయాలు మార్ట్ గేజ్ బాండ్ ఇస్తాయి.
బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు ఎలాగూ ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ, జీఎస్టీ వగైరా చెల్లించకతప్పదు. మళ్ళీ ‘మార్ట్ గేజ్ బాండ్’ కోసం ప్రభుత్వానికి ఈ ఫీజు కూడా చెల్లించుకోక తప్పదు.
సంక్షేమ పధకాల గురించి మీడియా ప్రకటనలకు, వాలంటీర్లకు అవార్డుల పేరుతో వందల కోట్లు పంచిపెట్టేస్తున్న జగన్ ప్రభుత్వం, ఆ డబ్బుని ఈవిదంగా ప్రజలను, పరిశ్రమలను పీడించి సమకూర్చుకోవాలనుకోవడం చాలా బాధాకరం.
చిన్న, మద్య, పెద్ద పరిశ్రమలని కాపాడుకొని వాటిని ఏవిదంగా నడిపించుకోవాలని ఆలోచించాల్సిన ప్రభుత్వం వాటి నుంచి ఏవిదంగా ముక్కు పిండి అదనంగా డబ్బు వసూలు చేయగలమని ఆలోచించడం చాలా దుర్మార్గమే కదా?




