బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఎందుకనో చంద్రబాబు నాయుడు అంటే పడదు. ఈ క్రమంలో ఆయన ఒక్కోసారి ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .. పోలవరం ప్రాజెక్టు ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని రాజశేఖర్రెడ్డి ప్రారంభించి కాల్వలు తవ్విస్తే, దానికి నాలుగు గొట్టాలు పెట్టి ఆ ప్రాజెక్టును తానే చేపట్టానని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.
గతంలో అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రస్తావించలేదని ఆయన ఆరోపించారు. సరే ఆయన చెప్పిందే నిజం అనుకుందాం. పోలవరానికి మేమే నిధులు ఇస్తున్నాం అని ఒక పక్క గొప్పలు చెప్పుకుంటున్నారు బీజేపీ వారు… అంటే ఇప్పుడు సోము వీర్రాజు చెప్పిన దాని బట్టి మొత్తం వైఎస్ కట్టేస్తే నాలుగు గొట్టాలు పెడుతున్నారు చంద్రబాబు, ఆ నాలుగు గొట్టాలకు సొమ్ములు ఇచ్చి జబ్బలు చేర్చుకుంటున్నారు బీజేపీ వారు. చంద్రబాబుని విమర్శిస్తున్నాం అనుకుంటూ ఏం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కాదు.
కేంద్రం నిధులు విడుదల చేస్తుంటే వాటితో లోపభూయిష్టంగా పనులు చేయిస్తూ కోట్ల నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రూ.1100 కోట్ల విలువైన స్పిల్ వే పనుల విలువను రూ.1400 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారని ఆరోపించారు. సరే అదే నిజం అనుకుంటే ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? రైతులకు ఎకరాకు రూ.29 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటే రూ.59 లక్షలు చెల్లించారన్నారు. చివరికి రైతులకు మేలు చేస్తున్నా ఏడుపు అంటే ఎలా వీర్రాజు గారూ?



