దాదాపు ఏడాదిన్నర క్రితం టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పి కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో మూడేళ్లలో ఇంగ్లండ్ లో జరిగే వరల్డ్ కప్ క్రికెట్ పోటీల నాటికి ధోనీ కెప్టెన్ గా ఉండకపోవచ్చని, ఒకవేళ అప్పటివరకూ ధోనీనే కెప్టెన్ గా కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయిస్తే, అది ఆశ్చర్యకరమైన విషయమేనని పేర్కొన్నారు.
వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని కోరిన గంగూలీ, జట్టు కెప్టెన్ పదవి కోసం కోహ్లీకి తాను మద్దతిస్తున్నట్టు తెలిపాడు. ధోనీ తొమ్మిదేళ్ల నుంచి జట్టును నడిపిస్తున్నాడని గుర్తు చేసుకున్న గంగూలీ, అద్భుతమైన కెప్టెన్ గా ధోనీ సేవలు అమోఘం అనడంలో సందేహం లేదని, అలాగే వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవాలన్నది కూడా తన అభిమతం కాదని స్పష్టం చేసారు.
అయితే ఇటీవల కాలంలో మైదానంలో కోహ్లీ తీరు బాగుందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, కెప్టెన్ ఎవరన్నది అంతిమంగా సెలక్టర్ల నిర్ణయమేనని చెప్పాడు. మరో నాలుగేళ్లు జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించే సామర్థ్యం ధోనీకి ఉంటుందా? అని ప్రశ్నించిన గంగూలీ, వన్డే పోటీల్లో ధోనీ మైదానంలో ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పుకొచ్చాడు.



