చూడచక్కని అందంతో పాటు చలాకితనం, మాటకారితనంతో ప్రేక్షకులను తన బుట్టలో వేసుకున్న తెలుగు బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఓ కార్యక్రమంలో తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యింది. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సీరియల్స్ నటులు తమ తండ్రుల గురించి అనుభవాలను పంచుకున్నారు. ఆ క్రమంలో మాట్లాడిన శ్రీముఖి… తనకు మాత్రం తన తండ్రి కన్నా, తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉందని వ్యాఖ్యానించింది.
అయితే సదరు షో నిర్వాహకులు శ్రీముఖి తండ్రితో తీసుకున్న బైట్ ను ఆ సమయంలో ప్లే చేశారు. దీంతో అవాక్కైన శ్రీముఖి… ఆ బైట్ ను చూస్తూ తీవ్ర భావోద్వేగం చెందింది. “అందరూ తనతో తన కూతురి గురించే చెబుతారని, అలాంటి కూతురు పుట్టడం తనకు గర్వకారణమని” శ్రీముఖి తండ్రి చేసిన వ్యాఖ్యలకు ఏమోషనల్ అయిపోయింది. దీంతో ఓ పక్కన కార్యక్రమం జరుగుతుండగానే ఏడుపు ఆపుకోలేకపోయింది. ఈ సీన్ ను ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా యధావిధిగా ప్రసారం చేశారు.
ఎప్పుడూ అల్లరి చిల్లరగా కామెడీ చేస్తూ, ఫుల్టూ బిందాస్ టైప్ లో ఫుల్ పటాస్ గా ఉండే శ్రీముఖిని ఇలా చూడడం చాలా అరుదు. ఆదివారం నాడు బుల్లితెరపై ప్రసారమైన ఆ కార్యక్రమంలో శ్రీముఖి ఉదంతమే హైలైట్ గా నిలిచింది. తను ఎక్కడున్నా… ఫోకస్ మాత్రం తన వైపుకు తిప్పుకునేలా చేయడంలో శ్రీముఖిని మించిన వారు లేరు అని మరోసారి చాటిచెప్పుకుంది… అది ఫుల్ పటాస్ అయినా… సెంటిమెంట్ అయినా..!



