సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపన సమయంలో తప్పనిసరిగా లేచి నిల్చోవాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరించేందుకు సుప్రీంకోర్టు తాజాగా అంగీకారం తెలపడం పట్ల సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై థియేటర్లలో లేచి నిలబడి తమలోని దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కీలక తీర్పు వెల్లడించింది.
జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలబడాలనడం దేశ భక్తికి సూచన కాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఫ్లాగ్ కోడ్ నిబంధనలను సవరించాలని కేంద్రానికి సూచించింది. శ్యాం నారాయణ్ చౌక్సీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
సమాజానికి మోరల్ పోలీసింగ్ అవసరం లేదని, అలాగే ఇకపై సినిమాలకు టీ షర్టులు, షార్టులు ధరించి రాకూడదని, అలా వస్తే జాతీయ గీతాన్ని అవమాన పరచడమే అవుతుందని ప్రభుత్వం అంటుందని కోర్టు ఆక్షేపించింది. తమ భుజాలపై తుపాకి పెట్టి కాల్చడాన్ని తాము అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.
గత డిసెంబరులో తాము ఇచ్చిన ఉత్తర్వుల్లోని ‘తప్పనిసరి’ పదాన్ని ‘చేయొచ్చు’ అని మార్చేందుకు సిద్ధమని కోర్టు పేర్కొంది. తమ భుజాలపై దేశభక్తిని మోయాలంటూ పౌరులను బలవంతం చేయబోమని స్పష్టం చేసింది. గతేడాది డిసెంబరు 1న జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనమే ఈ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.


