ప్రాంతీయ పార్టీలపై కుటుంబపాలన ముద్ర తప్పనిసరి.. జనసేన ఇందుకు అతీతం అనుకుంటే, నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాత ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవిలో నియమించారు.
ఆయన గత ఎన్నికలలో జనసేన అభ్యర్ధిగా లోక్సభకు పోటీ చేద్దామనుకున్నారు. కానీ కూటమిలో సీట్ల సర్దుబాట్ల కోసం త్యాగం చేయాల్సివచ్చింది. కనుక ఎమ్మెల్సీ పదవితో ఆయనకు జరిగిన నష్టాన్ని, అయన చేసిన త్యాగాన్ని భర్తీ చేశారని సర్ది చెప్పుకోవచ్చు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ఆలయ ప్రత్యేక ఉత్సవాల విషయంలో ఆమె ట్రస్ట్ బోర్డుకు తగిన సూచనలు, సలహాలు అందిస్తారట!
ఇలాంటి పదవులు సృష్టించి ఇవ్వదలచుకుంటే, జనసేన జెండామోసి కేసులలో చిక్కుకున్నవారు కోకొల్లలున్నారు. కానీ ఆ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్న సుస్మితకి ఈ పదవి కట్టబెట్టారు. దుర్గమ్మ భక్తులు చేసే పిర్యాదులను బోర్డు పట్టించుకోనప్పుడు, దానికి మరొకరి సలహాలు అవసరమా?
ఏది ఏమైనప్పటికీ, ఇక నుంచి ‘కొణిదల కుటుంబానికి పదవులు పందేరం’ అనే విమర్శలు వినిపించక మానవు. ఇటీవల చిరంజీవి సతీమణి సురేఖను యాదాద్రి ఆలయ బోర్డు సభ్యురాలుగా తెలంగాణ ప్రభుత్వం నియమించినప్పుడు ఇలాంటి విమర్శలే వచ్చాయి కదా?ఇప్పుడూ వస్తాయి. ఇలాంటి విమర్శలు అవసరమా?





