అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై ఆల్ ఇండియా లాచియా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఎల్డీఎంకే) వ్యవస్థాపకుడు, నటుడు టి.రాజేందర్ మండిపడ్డారు. జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ లో శశికళ ఏ హక్కుతో ఉంటున్నారని, శశికళ ఇలా హడావిడిగా ఎందుకు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని, అందులో ఆంతర్యం ఏమిటో చెప్పాలని, శశికళ సీఎం కావడం ఆ పార్టీలోని వారికే ఇష్టం లేదని పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత పలు సందర్భంగాల్లో ‘మక్కళాల్ నాన్..మక్కళుక్కాగవే నాన్’ అని చెప్పేవారని గుర్తుచేశారు. అంటే తనకు ఎవరితోనూ ఎలాంటి బంధాలు లేవని దానర్థమని… అటువంటప్పుడు జయతో శశికళకు ఎటువంటి సంబంధముందని ప్రశ్నించారు. ఏ హక్కుతో ఆమె పోయెస్ గార్డెన్లో ఉంటున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, జయలలిత తర్వాత అంతటి అర్హత ఉన్న వారే సీఎం బాధ్యతలు చేపట్టే హక్కు ఉంటుందని రాజేందర్ అన్నారు.
ఇదిలా ఉంటే… శశికళ సిఎం కావడానికి మార్గం సుగమం చేసిన పన్నీర్ సెల్వానికి కీలక పదవి ఇవ్వాలని శశికళ భావిస్తుండగా, పన్నీర్ మాత్రం తనకు ఎటువంటి పదవులు వద్దని చెబుతున్నట్టు సమాచారం. పదవిపై విముఖత చూపుతున్న ఆయనకు నచ్చజెప్పేందుకు శశికళ సీనియర్లను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన పన్నీర్ సెల్వాన్ని తొలుత స్పీకర్ పదవిలో నియమించాలని శశికళ భావించారు. అయితే పాలనపై పట్టున్న ఆయనకు ముఖ్యమంత్రి లేదంటే ఆర్థిక, హోం శాఖల్లో ఏదో ఒకటి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అసలు తనకు పదవే వద్దని పన్నీర్ భీష్మించుకుని కూర్చున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.



