వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం కన్నతండ్రి అని కూడా చూడకుండా, నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని జగనే చంపించాడని ఘాటు వ్యాఖ్యలతో సంచలన ఆరోపణలు చేసారు. కృష్ణాజిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమను కాపాడుతున్నారంటూ జగన్ ఆరోపిస్తున్నారని… సీఎం తమను ఎలా కాపాడుతున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో తాడిపత్రిలోని సాక్షి కార్యాలయం ముందు ధర్నాకు దిగిన ప్రభాకర్ రెడ్డి, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కావాలంటూ జగన్ పగటి కలలు కంటున్నారని… కానీ ఆయన ఆశలు నెరవేరవని, 2019 ఎన్నికల తర్వాత నేనే ముఖ్యమంత్రి అంటూ రోడ్లపై జగన్ పిచ్చోడిలా తిరుగుతాడని జోస్యం చెప్పారు. జేసీ సోదరులపై అనవసర రాద్ధాంతం చేయడాన్ని జగన్ మానుకోవాలని సూచించారు.
తమ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉందని, 1952లోనే తమ తండ్రి రాజకీయాల్లో ఉన్నారని, సంపాదించాలనే ధ్యాసే ఉంటే అప్పటి నుంచి తాము ఎన్ని కోట్లు సంపాదించుకునే వాళ్లమని ప్రశ్నించారు. తాము కేవలం బతుకుతెరువు కోసమే సంపాదించుకుంటున్నామని, తమరిలా దొంగ సూట్ కేస్ కంపెనీలు పెట్టి, దోచుకోలేదని, జగన్ పుట్టినప్పటి నుంచీ అతని కుటుంబ పరిస్థితులన్నీ తనకు తెలుసని, తన కుమారులు కార్లతో స్కూళ్లకు వెళితే, ఆ సమయంలో జగన్ కు కనీసం కారు కూడా లేదని ఎద్దేవా చేసారు.
ప్రతి ఒక్కరినీ సెంట్రల్ జైలుకు పంపుతామని జగన్ బెదిరిస్తున్నారని… తనను జైలుకు ఆయన పంపించేది ఏందయ్యా అని ప్రశ్నించారు. చట్ట ప్రకారం తనకు శిక్ష పడితే, తానే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బస్సు ప్రమాదం అనుకోకుండా జరిగిపోయిందని… మృతుల కుటుంబాలకు ఏం చేద్దామన్న ఆలోచనను వదిలేసి… జగన్ అనవసర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.



