ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు విశాఖని రాజధాని చేస్తానని చెప్పలేదు. కానీ విశాఖకు అనేక భారీ మద్య తరహా పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పర్యాటక పెట్టుబడులు, మెట్రో వంటి హంగులన్నీ సమకూర్చి రాష్ట్రానికి ఆర్ధిక రాజధానిగా మార్చుతున్నారు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, ఐటి మంత్రి నారా లోకేష్ ఇద్దరి కృషి వలన ప్రముఖ ఐటి కంపెనీ టీసీఎస్ విశాఖకు తరలివచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం భూకేటాయింపు జరిగిన వందరోజులలో కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. కనుక ముందుగా విశాఖలోని మిలీనియం టవర్స్లో 16,17 బ్లాకులు అద్దెకు తీసుకొని కంపెనీ ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో రెండు షిఫ్టులలో కలిపి సుమారు 2,000 మందికి, రెండో దశలో మరో 4,000 మందికి ఈ కంపెనీలో ఉద్యోగాలు లభించనున్నాయి.
రూ.1,370కోట్ల పెట్టుబడితో టీసీఎస్ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఐటి హిల్స్-3, లో ప్రభుత్వం కేటాయించిన 22 ఎకరాలలో శాశ్విత భవన సముదాయాలు నిర్మించుకుంటుంది. అవి కూడా అందుబాటులోకి వస్తే టీసీఎస్ కంపెనీలో 12,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
దీని తర్వాత ప్రపంచ ప్రఖ్యాత ‘గూగుల్’ కూడా విశాఖకు రాబోతోంది. ఇప్పటికే ఆ సంస్థ-ఏపీ ప్రభుత్వం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గూగుల్ ఏకంగా సుమారు రూ.50,000 కోట్లు పెట్టుబడితో ఆసియా ఖండంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. విశాఖలో మధురవాడ సమీపంలో 500 ఎకరాలలో ఏర్పాటవుతున్నడేటా సిటీలో ప్రభుత్వం గూగుల్ కోసం 80 ఎకరాలు కేటాయించింది. రాబోయే 6-12 నెలల్లో అనేక ఐటి కంపెనీలు విశాఖకు రాబోతున్నాయి.
విశాఖలో ఐటి కంపెనీలు, పరిశ్రమలు, పర్యాటక పెట్టుబడులు, మెట్రో, దాంతో బాటే ఫ్లై ఓవర్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడితే నగరం రూపురేఖలే మారిపోతాయి. మరోపక్క అమరావతి నిర్మాణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. కనుక ఇటు విశాఖ, అటు అమరావతి రాబోయే 4 ఏళ్ళలో అన్ని హంగులతో సిద్దమయితే అప్పుడు ఏపీలో హైదరాబాద్ ధీటుగా ఒకటి కాదు రెండు నగరాలు ఉంటాయి.






