ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని టిడిపి నేతలు కేంద్ర ఎన్నికల కమీషన్కు లిఖితపూర్వకంగా పిర్యాదులు చేస్తునే ఉన్నారు. ఓటర్ల జాబితాలలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని మీడియాలో నిత్యం వార్తలు వస్తునే ఉన్నాయి.
అయినా రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరేత్తిన్నట్లు వ్యవహరిస్తోంది. కనుక వైసీపి కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించడమో లేదా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేయడమో చేస్తోంది. అలాగే వైసీపి కోసం భారీగా దొంగ ఓటర్లు కూడా నమోదు చేయిస్తూనే ఉంది. ఒక్కో ఇంట్లో డజన్ల కొద్దీ ఓటర్లున్నట్లు నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనం.
ప్రజాస్వామ్యానికి పునాది వంటిది ఎన్నికల ప్రక్రియ. దానికి మూలం ఓటర్ల జాబితాలు. అవే సక్రమంగా లేనప్పుడు ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి ఎన్నికలు నిర్వహించి ఏం ప్రయోజనం?
ఈ పరిస్థితిని గమనించిన అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “ఓటర్ కార్డు ఉంటే ఓటు ఉన్నట్లు కాదు, ఓటరు లిస్టులో పేరు ఉంటేనే ఓటు ఉన్నట్లు. మరి మీ ఓటు ఓటరు లిస్టులో ఉందో లేదో చూసుకున్నారా? సమయం లేదు తమ్ముళ్లు మీ ఓటు స్థితిని తనిఖీ చేసుకోండి. చేర్పులు/తొలగింపులు/డబుల్ ఎంట్రీ మరి ఏ ఇతర సమాచారం కొరకైనా మీమీ బూత్ లలో ఎన్నికల సంఘం ప్రత్యేక శిబిరాలను సంప్రదించండి,” అంటూ ఎన్నికల కమీషన్ అధికారిక వెబ్సైట్ లింక్ కూడా దానికి జతచేశారు.
గొట్టిపాటి రవికుమార్ చెప్పింది నూటికి నూరు శాతం నిజమేనని అందరికీ తెలుసు. నేటికీ రాష్ట్రంలో చాలామంది ఓటర్లు తమకు ఓటర్ కార్డు ఉందనే ధీమాతో ఉన్నారు. కానీ ఓటర్ల జాబితాలో వారి పేరు లేకపోతే ఓటరు కార్డు ఉండి ఏం ప్రయోజనం?ఏపీ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలకు గొట్టిపాటి రవికుమార్ ట్వీట్ అద్దం పడుతోంది.
కనుక ఓటర్లందరూ తమ ఓట్లు పదిలంగా ఉన్నాయో లేవో ఇప్పుడే తనికీ చేసుకోవడం మంచిది. ఎన్నికల కమీషన్ అధికారిక వెబ్సైట్: https://electoralsearch.eci.gov.in లో ఓటర్లు తనికీ చేసుకోవచ్చు.




