వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలలో 175 సీట్లు కాకపోయినా కనీసం బొటాబోటి మెజార్టీతో అయినా గెలవాలనే ఆరాటంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గం ఇన్చార్జిలని మార్చేసుకుంటూ తన పార్టీ ఓటమికి తానే రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇందుకు టిడిపి, జనసేనలు జగన్కు థాంక్స్ చెప్పుకోవలసిందే!
మొదటి రెండు జాబితాలకే వైసీపిలో కొన్ని వికెట్లు పడిపోయాయి. మూడో జాబితా నిన్న వెలువడవలసి ఉంది. అది ఇంకా వెలువడలేదు. వెలువడితే మరికొన్ని వికెట్లు పడిపోతాయి. కానీ అది వెలువడక ముందే మరో రెండు వికెట్లు పడిపోయాయి. మరో మూడు పెద్ద వికెట్లు పడిపోబోతున్నాయి.
కర్నూలు వైసీపి ఎంపీ సంజీవ్ కుమార్ ఇప్పటికే పదవికి, పార్టీకి రాజీనామా చేయగా తిరువూరు వైసీపి ఎమ్మెల్యే రక్షణానిధి కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారు.
జగన్ మూడో జాబితాకి కూడా ఆమోదముద్ర వేసేస్తే మరో అరడజనుకు పైగా ఎమ్మెల్యేలు, టికెట్ ఆశించి భంగపడిన నేతలు వైసీపికి గుడ్ బై చెప్పేసేందుకు సిద్దంగా ఉన్నారు.
కనుక “నువ్వే మా నమ్మకం జగన్… నువ్వే మా భవిష్యత్ జగన్…” అని వైసీపిలో కూడా ఎవరూ గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకి, జగన్కే ఒకరిపై మరొకరికి నమ్మకం లేనప్పుడు ఇక ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది?
ఏది ఏమైనప్పటికీ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను చూసి వైసీపిలో అందరూ కలవరపడుతుంటే, టిడిపి, జనసేనలు మాత్రం చాలా సంతోషిస్తుండవచ్చు. ఎందుకంటే కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్లు, అవి కష్టపకుండానే జగనే స్వయంగా వైసీపిని ఓడించుకునేందుకు జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు కనుక!




