ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుదవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఈ నాలుగేళ్ళలో జగన్ ప్రభుత్వం అధికారికంగా రూ.2,39,716 కోట్లు, అనధికారికంగా మరో రూ. 4,74,315 కోట్లు కలిపి మొత్తం రూ. 7,14,631 కోట్లు అప్పులు చేసిందని బయటపెట్టారు.
అయితే ఇదివరకు టిడిపి నేతలో లేదా మీడియాలోనో జగన్ ప్రభుత్వం పది లక్షలకోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిందని విమర్శించినప్పుడు రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, దువ్వూరి కృష్ణ వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉందని, ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని ఆరోపించారు.
అయితే నిన్న దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొన్న ఈ లెక్కలను బయటపెట్టి నిలదీస్తే ఇంతవరకు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ వైసీపీ మంత్రులు గానీ స్పందించలేదు.
కనుక ఏపీ టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు మేము చెప్పింది కూడా ఇవే లెక్కలు కదా? కానీ అప్పుడు మీరు మాపై విరుచుకుపడ్డారు. మరిప్పుడు ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లెక్కలకు ఏం సమాధానం చెపుతారు?ఆమె చెప్పినదంతా అబద్దమని ఖండించగలరా?” అని ప్రశ్నించారు.
“టిడిపి ప్రభుత్వం దిగిపోయే సమయానికి రూ.3,62,375 కోట్లు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వాటాగా వచ్చిన అప్పుతో కలిపి అంతుంది. అయితే ఈ నాలుగేళ్ళలో జగన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని పూర్తిచేయకపోయినా రూ. 7,14,631 కోట్లు అప్పులు దేని కోసం ఖర్చు చేశారు?ఆ సొమ్మంతా ఏమైపోయింది? రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుంటే దానిని నియంత్రించాల్సిన కేంద్రప్రభుత్వం ఇంతకాలం సహకరించి ఇప్పుడు విరుచుకుపడి ఏం ప్రయోజనం?” అని పట్టాభి ప్రశ్నించారు.
ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇంత ఖచ్చితంగా లెక్కలు చెప్పి ప్రశ్నించినప్పుడు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పనిసరిగా స్పందించి వివరణ ఇవ్వాలి. కానీ ఆయన స్పందించలేదు. తమ ప్రభుత్వం ఎవరైనా విమర్శిస్తే మూకుమ్మడిగా దాడి చేసే మంత్రులు ఎవరూ కూడా ఇంత వరకు స్పందించలేదు.
ఎందుకంటే ఇది కేంద్రప్రభుత్వంతో వ్యవహారం. పైగా ఈ అంశంపై వాదించడం మొదలుపెడితే పెద్ద చర్చ మొదలవుతుంది. అప్పుడు వాస్తవాలు బయటపడితే అందరికీ సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే దగ్గుబాటి పురందేశ్వరి నాలుగు విమర్శలు చేసినా వైసీపీ నేతలు వినపడన్నట్లు నటిస్తున్నట్లున్నారు. కానీ ఇప్పుడు టిడిపి కూడా దీనిపై నిలదీస్తోంది కనుక నిద్రనటిస్తున్న వైసీపీ నేతలు కనీసం దానికి సమాధానం చెప్పుకోవడానికైనా ఏదో ఒకటి మాట్లాడక తప్పదు.



