ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా మారిన నంద్యాల ఉప ఎన్నికల ఫలితం దాదాపుగా వచ్చేసినట్లే! ఎవరినైతే జగన్ విశ్వసించి ‘చంపేయండి, ఉరి తీయాలి’ అంటూ సినిమా డైలాగ్స్ మాట్లాడి వర్కౌట్ అవుతుందని అనుకున్నారో, అదే ప్రజానీకం జగన్ కు భారీ షాక్ ఇచ్చారు. ఉప ఎన్నికలలో తొలి అయిదు రౌండ్లు నంద్యాల రూరల్ లెక్కింపు కాగా, ఆరు నుండి పదహారు రౌండ్ల వరకు అర్బన్ ప్రాంతం లెక్కింపు, మిగిలిన మూడు రౌండ్లలో గోస్పాడు మండలం ఓట్లను లెక్కించనున్నారు. ఈ మొత్తంలో రూరల్ మరియు గోస్పాడు మండలం ఓట్లలోనే జగన్ ఆశలు పెట్టుకున్నారు.
బ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత అసలు ట్విస్ట్ ఏమిటంటే… తొలి అయిదు రౌండ్లు పూర్తయ్యే సమయానికి దాదాపుగా 13 వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుపును ఖాయం చేసుకున్నారు. తొలి రౌండ్ లో 1198 ఓట్లతో ప్రారంభమైన లీడింగ్ రౌండ్ రౌండ్ కు పెరుగుతూ పోతోంది. జగన్ ఎంతగానో విశ్వసించిన రూరల్ కౌంటింగ్ లో కనీసం ఒక్క రౌండ్ లో కూడా వైసీపీ పోటీనిచ్చే దిశగా లేకపోవడం అనేది మామూలు షాక్ కాదన్నది రాజకీయ విశ్లేషకుల భావన. రూరల్ ముగిసే సమయానికే 13 వేలు దాటితే, అర్బన్ ముగిసే సమయానికి అంచనాలకు వేయని రీతిలో లీడింగ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ పరిణామాలతో జగన్ తన ఇంటి నుండి క్రిందికి కూడా దిగలేదన్న విషయం మీడియా వర్గాల ద్వారా స్పష్టమైంది. జగన్ కు ఆరోగ్యం బాగోలేదంటూ పార్టీ వర్గాలు దీనిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి గానీ, బహుశా ఫలితాలు వైసీపీ అనుకూలంగా ఉంటే ఆరోగ్యం మెరుగుగా ఉండేదేమో! మొన్నటివరకు పార్టీ నేతలతో కళకళలాడిన లోటస్ పాండ్ ప్రస్తుతం వెలవెలబోతోంది. ఓటమి చవిచూసినా గట్టిపోటీనిస్తుందని భావించిన పార్టీ వర్గాలకు, ఈ ఫలితం ఏ మాత్రం మింగుడు పడడం లేదని చెప్పొచ్చు.


