ఫస్ట్ అటెంప్ట్ లోనే ‘బిగ్ షాట్’ అవుట్?

TDP-MLA-Bhuma-Akhila-Priyaభూమా నాగిరెడ్డి మరణం తర్వాత అతి చిన్న వయసులో మంత్రి పదవి దక్కించుకున్న భూమా అఖిలప్రియ, త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిజానికి ఇది భూమా ఆధిపత్యానికి ఒక అగ్ని పరీక్షలా మారింది. పార్టీ టికెట్ విషయం నుండి నెలకొన్న వివాదం, చివరకు శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీలో చేరేలా చేసింది. ముందుగా జరిగిన డీల్ మేరకు వైసీపీ నుండి శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగుతుండగా, ఇటు టిడిపి నుండి భూమా కుటుంబ వర్గీయులు పోటీపడుతున్నారు.

నంద్యాల టికెట్ ను భూమా కుటుంబానికే దక్కేలా చేయడంలో అఖిల ప్రియ తొలి విజయం సాధించిందని చెప్పాలి. ఒక విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఒప్పించిందనే పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకానొక సమయంలో అఖిల ప్రియకు ఉన్న రాజకీయ అనుభవం రీత్యా, ఇతరులకు సీట్ ను కేటాయించాలని భావించినప్పటికీ, తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన స్థానంలో మరొకరిని చూడడం ఇష్టం లేని అఖిల ప్రియ, అందరినీ ఒప్పించి భూమా కుటుంబానికే సీటును దక్కేలా చేసింది.

ADVERTISEMENT

ఇక మిగిలి ఉంది విజయం మాత్రమే! కానీ అటు వైపు శిల్పా మోహన్ రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్ధి ఉండడం, అఖిల ప్రియ అండగా తొలిసారి ఎన్నికలు జరుగుతుండడంతో నంద్యాలలో ఏమవుతుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొంది. అఖిల ప్రియ అనుభవ రాహిత్యాన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా వైసీపీ కూడా స్కెచ్ లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అఖిల ప్రియపై మాటల ఒత్తిడి తీసుకురాగా, దానికి ప్రతిగా స్పందించిన అఖిల టంగ్ స్లిప్ అయ్యేలా చేయడంలో సక్సెస్ సాధించింది.

ఉడుకురక్తంలో ఉన్న అఖిలప్రియ, “నంద్యాల ఉప ఎన్నికలలో తాము ఓటమి పాలయితే, శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని” సంచలన ప్రకటన చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలతో తప్పనిసరిగా తామే విజయం సాధిస్తామని, ఒకవేళ ఓటమి పాలయితే మాత్రం, దానికి పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తానని తెలిపారు. ఇదే అదునుగా తీసుకున్న వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి, ఈ సవాల్ ను స్వీకరిస్తూ…. ఈ ఎన్నికలలో ఓటమి పాలయితే తాను కూడా రాజకీయాల నుండి వైదొలుగుతానని కీలక ప్రకటన చేసారు.

దీంతో నంద్యాల ఉప ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఎలాగైనా గెలవాలన్న పట్టుదల ఇరు వర్గాలలోనూ కనపడుతుండగా, ఎడ్జ్ మాత్రం భూమా కుటుంబానికే ఉంటుందనేది చరిత్ర చెప్తున్న అంశం. భూమా నాగిరెడ్డి చనిపోవడం ద్వారా ఖాళీ అయిన ఇలాంటి స్థానాలలో… ప్రజలలో ఉండే సెంటిమెంట్స్ రీత్యా సహజంగా వారసులే విజయం సాధిస్తారు తప్ప, మరొకరు కాదు అన్నది ప్రపంచ రాజకీయం చెప్తోంది. ఒకవేళ అదే జరిగితే మొదటి అడుగులోనే బిగ్ షాట్ అయిన శిల్పాను పూర్తిగా రాజకీయాల నుండి దూరం చేసే అరుదైన అవకాశాన్ని అఖిల ప్రియ సొంతం చేసుకున్నట్లవుతుంది.

ADVERTISEMENT
Latest Stories