దశబ్ద కాలంపాటు అనుభవించిన అధికార దర్పం, హంగు ఆర్బాటాలను కోల్పోవడంతో కేటీఆర్ ఎవరిని నిందించాలనో, ఎవరికీ భరోసా కలిపించాలనుకుంటున్నారో కానీ ప్రతిదాని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తన అసహనాన్ని వెళ్లబుచ్చుతున్నారు.
మొన్నటి దాకా పనుల పై కాకుండా ప్రచారాల పై, ఆచరణ సాధ్యం కానీ హామీల పై ద్రుష్టి పెట్టినట్లయితే మా పార్టీ తిరిగి అధికార పీఠం దక్కించుకునేది అంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. అంటే గత ఎన్నికల సమయంలో తెరాస అభివృద్ధి పనులు చేసి ప్రజలను మెప్పించడం ద్వారా కాకుండా ప్రచార కార్యక్రమాలు, అమలు కానీ హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కేటీఆర్ ఒప్పుకుంటున్నారా.?అంటూ కేటీఆర్ కు ఎదురు ప్రశ్నలు మొదలయ్యాయి.
బిఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు తమ అభివృద్ధిని తామే కాలరాసుకున్నారని, ప్రజలు తప్పుచేశారని, కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం ప్రభుత్వాన్ని నడపలేదంటూ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అవమానించేలా వ్యాఖ్యానించి కేటీఆర్ విమర్శలు పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్ పార్టీని, ప్రజలను వదిలి బీజేపీ పార్టీ పై తన అక్కసు వెళ్లగక్కారు కేటీఆర్.
దేశమంతా పంచుతున్న అయోధ్య రామమందిర అక్షింతలను ఈసారి తన రాజకీయ విమర్శలకు వాడుకున్నారు కేటీఆర్. తాము కూడా యాదాద్రి అక్షింతలను పంచినట్లయితే గెలిచేవాళ్ళమేమో..అంటూ బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తుందన్నారు. బీజేపీ మతాన్ని తమ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటుందని, తమది అసలైన సెక్యులర్ పార్టీ అంటూ మరికొన్ని విమర్శల అక్షింతలను వేసుకోవడాని రెడీ అయ్యారు కేటీఆర్.
బీజేపీ చేస్తుంది రాజకీయమా? కాదా అనేది కాసేపు పక్కన పెడితే అయోధ్యలో జరుగుతుంది రాజకీయాలతో సంబంధం ఉన్నప్పటికీ రాజకీయ కార్యక్రమం కాదు అనేది కేటీఆర్ గుర్తించాలి. దానివలన ఎవరికీ ఎన్ని ఓట్లు పడతాయి?ఎవరికీ ఎన్ని సీట్లు దక్కుతాయి?ఎవరు అధికారాన్ని అందుకుంటారు? దేని కోసం ఈ అక్షింతల పంపిణి ? అనేది అప్రస్తుతం. అక్షింతలు పంచితేనే అధికారం దక్కుతుంది అనుకుంటే గత ఎన్నికలలో తెరాస తెలంగాణ ప్రజలకు ఏ అక్షింతలు పంచి అధికార పీఠాన్ని తిరిగి దక్కించుకుందో చెప్పాలి.
అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసాం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాము అంటూ అభివృద్ధి గురించి మాట్లాడి….అధికారం కోల్పోగానే అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం, ఓటమి పాలయ్యాం అంటూ అక్షింతలు – ప్రచారాల గురించి మాట్లాడాడం తనలోని ఓటమి తాలూకా అసహనాన్ని తెలియచేస్తుంది. అయినా “ప్రజలకు అక్షింతలు పంచితే కాదు ప్రజలు అక్షింతలు వేస్తే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలుగుతారు” అనే చిన్న లాజిక్ ను ఈ మాజీ ఐటీ మంత్రి మరిచిపోయినట్టున్నారు.




