పదేళ్ల తరువాత అధికారం అందుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు చేచేతుల నాశనం చేసుకుంటుందా.? కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసలుసిసలైన రాజకీయం తాజాగా తెరమీదకు వస్తుందా.? అయితే కాంగ్రెస్ పార్టీలో పుట్టుకొచ్చిన ఈ అలజడి టీ కప్పులో తుఫాన్ మాదిరి ముగిసి పోతుందా.? లేదా సునామి లా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని సర్వ నాశనం చేస్తుందా.?
అసలు కాంగ్రెస్ లో మొదలైన ఈ అంతర్గత విభేదాల వెనుకున్న అసలు కారణం ఏంటి.? పార్టీలో గౌరవం దక్కడం లేదంటూ ఒకరు, ప్రభుత్వంలో భాగం కాలేకపోతున్నాం అంటూ మరొకరు, వలస పార్టీ నేతలకే ప్రాధాన్యం అంటూ ఇంకొకరు, భవిష్యత్ రాజకీయాల కోసం ఇప్పుడే కుర్చీలాట మొదలుపెట్టిన వారు వేరొకరు…ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు బహిరంగం అవుతున్నాయి.
రేవంత్ కు అనుకూల వర్గం – వ్యతిరేక వర్గం అంటూ తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలిపోయిందా.? పచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ డివైడ్ అయిపోయిందా.? అంటూ మీడియా ప్రతినిధులే పార్టీ నాయకులను అడిగే స్థాయికి కాంగ్రెస్ లో వర్గ పోరు రచ్చకెక్కుతుంది.
రేవంత్ లో ఇప్పటికి టీడీపీ డిఎన్ఏ నే ఉందంటూ, రేవంత్ ఇప్పటికి బాబు మనిషే అంటూ ప్రత్యర్థుల నుంచి వచ్చే కామెంట్స్ కి ఇప్పుడు పార్టీలో బయటకొస్తున్న విభేదాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు చాల సైలెంట్ గా ఉన్న రేవంత్ సర్కార్ లో ఇప్పుడు ఈ అలజడికి కారణం ఏమిటి.? ఎవరు.? అనే ప్రశ్న రేవంత్ అభిమానులను కలవరపెడుతుంది.
కొండా సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ టార్గెట్ గా విమర్శలు చేయడం, ఆయనకు సవాల్ విసరడం, జీవన్ రెడ్డి రాజీనామా సమయంలో కూడా రేవంత్ కి వ్యతిరేకంగా స్వరం వినిపించడం, ఇక రాజగోపాల్ తన మంత్రి పదవి కోసం రేవంత్ ను ఇరుకున పెట్టెల ప్రకటనలు చేయడం, చిన్నా రెడ్డి సైతం రేవంత్ పై పరోక్ష విమర్శలు సంధించడం వంటి అంశాలన్నీ కూడా రేవంత్ కి వ్యతిరేకంగా పార్టీలో తెరవెనుక రాజకీయం నడుస్తుందా.? అన్న చర్చకు తెరలేపుతుంది.




