ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ 90-100 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రాబోతోందని, కనుక కాంగ్రెస్, బీజేపీ నేతల చిల్లర మాటలు విని అయోమయ పడవద్దని ప్రజలకు చెపుతున్నారు. అదే నోటితో ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మేము కాదు… తెలంగాణ రాష్ట్రం, ప్రజలే తీవ్రంగా నష్టపోతారంటూ కేసీఆర్ ఎమ్మోషనల్ బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ నుంచి ఎమ్మోషనల్ బ్లాక్ మెయిల్కు దిగడం ద్వారా ఈసారి బిఆర్ఎస్ పార్టీకి గండం ఉందని కేసీఆర్ అంగీకరిస్తున్నట్లే భావించవచ్చు. ఆ గండం కాంగ్రెస్ పార్టీ నుంచే ఉండవచ్చని కేసీఆర్ మాటలతోనే అర్దమవుతోంది.
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అసలు పట్టించుకొని కేసీఆర్ ఇప్పుడు నిత్యం కాంగ్రెస్ భజనే చేస్తుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే తాను కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేసినప్పటికీ మళ్ళీ పుంజుకొందని స్వయంగా ధృవీకరించి, దాని నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుందని అంగీకరిస్తున్నారు.
అసలు తనకు, బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో తిరుగేలేదని గట్టిగా నమ్మే కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ గురించే కేసీఆర్ ఎక్కువగా మాట్లాడుతూ, అప్రయత్నంగానే ప్రజలకు కూడా దానిపై నమ్మకం కలిగేలా చేస్తున్నారు. ఇంతకాలం రేవంత్ రెడ్డి పేరును ఉచ్చరించడానికి కూడా ఇష్టపడని కేసీఆర్, ఇప్పుడు పదేపదే రేవంత్ రెడ్డిని పేరు పెట్టి విమర్శిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన తొలి విజయమే అని భావించవచ్చు.
మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కూడా ఈసారి ఎన్నికలలో ‘బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే’ అని మాట్లాడుతున్నారు. వారు ఏ ఉద్దేశ్యం, ఆలోచనతో ఈ మాట అంటున్నప్పటికీ ఈసారి కాంగ్రెస్ పార్టీ వలన బిఆర్ఎస్ పార్టీ నష్టపోతుందని అందరూ గ్రహించిన్నట్లే ఉన్నారు. అంటే కేసీఆర్తో సహా బిఆర్ఎస్ పార్టీలో అందరూ అప్పుడే ఓటమికి మానసికంగా సిద్దపడుతున్నట్లే అర్దమవుతోంది.
ఏపీ కంటే తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముందు జరుగుతున్నందున ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తే, ఆ ప్రభావం ఏపీ శాసనసభ ఎన్నికలపై కూడా పడవచ్చు. అది ఏవిదంగా ఉంటుందనేది ఎన్నికల ఫలితాలు వెలువడిన తెలియవచ్చు.




