పదేండ్ల అవినీతికి చరమ గీతం పాడి, ఫామ్ హౌస్ పాలన కాదు ప్రజా పాలన కావాలి అంటూ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవడానికి డిసెంబర్ 3 వరకు ఆగాల్సిన పనిలేదు ఈ క్షణం నుంచే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖరారయ్యింది అంటూ ఒకపక్క రేవంత్ మీడియా ముందు కాస్త ఎక్కువగానే స్పందిస్తున్నారు.
మరో పక్క వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చి సౌత్ లోనే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డ్ సృష్టించడం ఖాయం అంటూ బిఆర్ఎస్ నేతలు తమ గెలుపు పై ధీమాను వ్యక్తపరుస్తున్నారు. అలాగే కేసీఆర్ ఏకంగా డిసెంబర్ 4 వ తేదీన కాబినెట్ మీటింగ్ ఉంటుంది అంటూ మరో అడుగు ముందుకేశారు.అయితే వీరంతా కూడా ఎన్నికలలో పార్టీ తరుపున తమ వంతు ప్రచారం చేసి గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారులే అనుకుంటే అసలు త్యాగాల సాకుతో పోటీకి ‘పంగనామం’ పెట్టి మీడియా ముందు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు వైస్ షర్మిల.
ఏపీలో ఇచ్చిన బై బై బాబు నినాదం ఫలించడంతో ఎగ్జిట్ పోల్స్ ను నమ్ముకుని తెలంగాణలో కూడా పేరు మార్చి అదే నినాదం ఎత్తుకున్నారు షర్మిల. “బై బై కేసీఆర్” అంటూ జగనన్న పెట్టిన సూటుకేస్ కంపెనీలో నుండి ఒక సూటుకేస్ తెచ్చి దాని పై బై బై కేసీఆర్ అంటూ రాసుకుని మీడియా ముందుకు విచ్చేసారు వైస్ షర్మిల.తన లక్ష్యం నెరవేరబోతోంది, తన త్యాగానికి ఫలితం రానుంది అన్నట్లు పెద్ద పెద్ద సినిమా డైలాగ్స్ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు షర్మిల.
పాదయాత్రలు చేసినా పట్టించుకోని ప్రజలు, మద్దతిచ్చినా గుర్తించని కాంగ్రెస్ పార్టీ, విమర్శిస్తున్నా స్పందించని బిఆర్ఎస్ పార్టీ…, ఇక ఏం చేయాలో తేల్చుకోలేకనే షర్మిల ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటూ విమర్శలు మొదలయ్యాయి. హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో ఉన్న కామిడీయన్ ను చంపినట్టు నీకెందుకమ్మా ఈ నినాదాలు అంటూ నిలదీస్తున్నారు రెండు పార్టీల అభిమానులు.తెలంగాణ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్! చూస్తుంటే నెగ్గేదెవరో? తగ్గేదెవరో? అంటూ మరో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నారు తెలుగు ప్రజలు.




