ఏపీ భవిష్యత్‌ను నిర్ణయించనున్న తెలంగాణ ఎన్నికలు!

BRS Congress BJP Parties

ఈ నెల30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 3న తెలంగాణతో సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ వంటి ఈ ఎన్నికలు కాంగ్రెస్‌, బీజేపీల భవిష్యత్‌ ఏవిదంగా ఉండబోతోందో సూచించబోతున్నాయి.

ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణతో సహా మూడు రాష్ట్రాలలో గెలిచినా అది జాతీయస్థాయి రాజకీయాలలో మార్పులకు దారితీయవచ్చు. ఒకవేళ తెలంగాణ మినహా రెండు, మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలిస్తే, కాంగ్రెస్‌ ఎదుగుదలకు అడ్డుకట్టపడవచ్చు.

ADVERTISEMENT

తెలంగాణ ఎన్నికలు బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల, వాటి నేతల తలరాతలు మార్చేయబోతున్నాయి. ఒకవేళ బిఆర్ఎస్‌ గెలిస్తే కేసీఆర్‌ ఈసారి కాంగ్రెస్‌ని పూర్తిగా తుడిచిపెట్టేయడం ఖాయం. ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే కేసీఆర్‌కు గడ్డుకాలం మొదలైన్నట్లే.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రా రాజకీయాలు, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏపీలో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నివిదాల తోడ్పడటం ఖాయమే. కనుక బిఆర్ఎస్‌ గెలుపు వైసీపికి చాలా అవసరమే.

ఒకవేళ తెలంగాణలో బిఆర్ఎస్‌ గెలిస్తే, దాని చేతిలో ఓడిపోయిన బీజేపీ అప్పుడు ఏపీలో టిడిపి, జనసేనలతో పొత్తుకి సిద్దపడవచ్చు. కానీ బీజేపీతో పొత్తు ద్వారా టిడిపి, జనసేనలు ఆశిస్తున్న కేంద్ర సహకారం లభించకపోయినా, బీజేపీకి కూడా అవి సీట్లలో వాటా పంచి ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ఆవిదంగా అవి నష్టపోయే అవకాశం ఉంటుంది.

ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే, టిడిపి, జనసేనలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తుంది. కానీ వాటితో బీజేపీ చేరితే, కాంగ్రెస్‌ వాటికి దూరంగా ఉండిపోక తప్పదు. కనుక ఏపీలో బీజేపీ వైఖరి ఏమిటనేది చాలా కీలకం కానుంది.

డిసెంబర్‌ 3వ తేదీతో తెలంగాణ రాజకీయాలు ఓ కొలిక్కి వస్తే, అప్పటి నుంచే ఏపీలో రాజకీయాలలో మార్పులు చేర్పులు మొదలవుతాయి. కనుక తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీకి కూడా చాలా కీలకమే అని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories