పేపర్ విధానాలకు స్వస్తి చెప్పిన తెలంగాణా ప్రభుత్వం ఇక నుండి సినిమా టికెట్లను కూడా ఆన్ లైన్ లో విక్రయించే ఏర్పాట్లు చేయనుంది. దీనిపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటన చేసారు. తెలంగాణా రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లలో టికెట్లను ఆన్ లైన్ చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ త్వరలోనే జరుగుతుందని తెలిపారు.
తలసాని చేసిన ప్రకటనతో సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ విధానం వలన బ్లాక్ మార్కెట్లో విక్రయించే సౌలభ్యం లేకుండా పోతుంది. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో టికెట్ల ధరలు అమాంతం పెంచేసి అమ్ముతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి’ టికెట్ ధర 3 వేలు అంటే ‘సర్ధార్’ టికెట్ 2 వేలు అంటూ పోటీపడ్డ విధానం తెలిసిందే. ‘ఆన్ లైన్’ విధానం వలన ఇలాంటి ప్రక్రియకు శుభంకార్డు వేసినట్లవుతుంది. అయితే ఎప్పటి నుండి ఈ విధానం అమలులోకి వస్తుందనేది తలసాని గారు స్పష్టత ఇవ్వలేదు.



