కేసీఆర్ ను గద్దె దించడమే ధ్యేయంగా మహాకూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీకి15 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానం, సీపీఐకి 4 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 25 సీట్ల వరకు కావాలని టీడీపీ అడుగుతునట్టు సమాచారం.
[m9ad]
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంలో భాగంగా కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి(టీజేఎస్), సీపీఎం పార్టీ నాయకులతో చర్చలు కొనసాగిస్తున్నారు. టీజేఎస్కు 6, సీపీఐకి 4, సీపీఎంకు 4 అసెంబ్లీ సీట్లివ్వాలని యోచనలో ఉన్నారు. అదే విధంగా అన్ని పార్టీలకు కలిపి మూడు లోక్సభ స్థానాలు కూడా కేటాయించేందుకు టీపీసీసీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా మహాకూటమి ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే… ఆపద్ధర్మ ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై గతంలో నమోదైన కేసులను తిరగదోడుతుందనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే జగ్గారెడ్డి అరెస్టు కాగా మరో కాంగ్రెస్ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు గండ్ర భూపాల్రెడ్డిలపై ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా హౌసింగ్ సొసైటీ కేసులో రేవంత్రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులు జారీ చేశారు.



