తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నాయకుల మార్పుల చేర్పులతో రోజురోజుకి వేడెక్కుతుంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతోనే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేదాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నేతలు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినా పొన్నాల లక్ష్మయ్య రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఇప్పటికే కారు ఎక్కారు.అలాగే తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ నియంత పాలన నుండి తెలంగాణకు విముక్తి రావాలంటూ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇలా బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన,చేరుతున్న వారి లిస్ట్ నానాటికి పెరిగిపోతూ వస్తుంది.
అందులో రేఖా నాయక్, మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆకుల లలితా, జి ఏహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ మాదాపూర్ కార్పొరేట్ జగదీశ్వర్ గౌడ్, నల్గొండ మున్సిపల్ చెర్మన్ అబ్బగౌని రమేష్, కోదాడ బిఆర్ఎస్ నేత శశిధర్, బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి, ముధోల్ మాజీ ఎంమ్మెల్యే నారాయణరావు ఇలా మరికొందరు ప్రముఖులు కూడా ఈ కండువాలు మార్చే పనిలో కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా బిఆర్ఎస్ పార్టీని వీడి సంధ్యా రాణి కమలం తీర్థం పుచ్చుకున్నారు.
ఇలా అధికభాగం నేతలు అధికార పక్షాన్ని వదులుకుని ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాష్ట్రంలో పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత గట్టిగానే ఉందని, సర్వేల ప్రభావం బాగానే ఫలించిందని ఆయా నేతలు నమ్ముతున్నారా? అనే సందేహం రాకమానదు.ఇలా ప్రతి ఎన్నికలకు పార్టీ కండువాలు మారుస్తున్న నేతలు ప్రజలను ఏమారుస్తూ తమ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తుండడం ప్రజల అమాయకత్వాన్ని సూచిస్తుంది.
ఒక పార్టీలో చేరడం ఆ పార్టీ ఎన్నికలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అధిష్టానాన్ని నయానో భయానో మెప్పించి ఆ పార్టీలోనే ఎదో ఒక పదవిని పొంది అధికారం ఉన్నన్నాళ్ళు పార్టీలో కొనసాగుతారు. అదే పార్టీ ఎన్నికలలో ఓటమి చెంది ప్రతిపక్ష స్థానానికే పరిమితమైయితే నియోజక వర్గ అభివృద్ధి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలోకి చేరడం నేటి రాజకీయ నాయకులకు సంప్రదాయంగా,ప్రజలకు అలవాటుగా మారిపోయింది.
తమను తమ పార్టీని నమ్మి ప్రజలు ఇచ్చిన తీర్పుని నేటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఏమాత్రం గౌరవిస్తున్నారో చూస్తూనే వస్తున్నాం.ఎన్నికలవేళ ఇలా పార్టీల కండువాలు మార్చే సంప్రదాయం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు యావత్ దేశంలో ఉన్న అన్నిరాష్ట్రాలకు,అన్ని రాజకీయ పార్టీల నేతలది ఇదే పరిస్థితి. అయితే రాజకీయ నాయకులు అధికారమే పరమావధిగా ఇలా పార్టీలు మారడమే ఇక్కడ చర్చనీయాంశం.
ప్రజల కోసమే,నియోజకవర్గం అభివృద్ధికే, జిల్లాలను మెరుగుపర్చడానికే, రాష్ట్ర శ్రేయస్సుకే, అంతా మీకోసమే అంటూ ప్రజలను మభ్య పెట్టే రాజకీయాలకు ఇకనైనా ప్రజలు స్వస్తి చెప్పాలంటూ రాజ్యాంగ ప్రేమికులు కోరుతున్నారు. ఎన్నికల ముందు ఎన్నికల ఫలితాల తరువాత ఈ కండువాలు మార్పుకి వేళయరా! అంటూ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉంటారనేది రాజకీయ సంప్రదాయంగా మారిపోయింది.




