బిజెపి గురించి తెలంగాణకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి చాలా ఆలోచింపదగ్గ వ్యాఖ్యలు చేశారు.
రాజగోపాల్ రెడ్డి: “మా పార్టీ అధిష్టానం ఉత్తరాది రాష్ట్రాలలో అనుసరిస్తున్న ఫార్ములానే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలలో గుడ్డిగా అమలుచేయాలనుకొంటోంది. అదిక్కడ పని చేయదని చెప్పినా అధిష్టానం మా మాటలను పట్టించుకోవడం లేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏవిదంగా ముందుకు వెళితే కేసీఆర్ను గద్దె దించగలమో చెపుతున్నా వినడం లేదు. మా మాటకు పార్టీ విలువే ఇవ్వడం లేదు. ఎవరికీ ఏ బాధ్యతలు అప్పగించడం లేదు,” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి: “బిజెపికి-బిఆర్ఎస్ పార్టీకి మద్య ఏదో రహస్య అవగాహన ఉందనే అనుమానాలు తెలంగాణ ప్రజలలో బలంగా ఉన్నాయి. పార్టీ పట్ల ప్రజలలో నమ్మకం ఉండాలి కానీ అనుమానం ఉంటే ఎలా గెలవగలము?కనుక పార్టీ ప్రజల నమ్మకం పొందేందుకు బిఆర్ఎస్కి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు.
తెలంగాణ బిజెపి నేతలు వ్యక్తం చేసిన ఈ రెండు అభిప్రాయాలూ ఏపీ బిజెపి నేతలకి కూడా వర్తిస్తాయని అర్దమవుతూనే ఉంది. “పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని మా పార్టీ పెద్దలతో మాట్లాడుకొంటారు” అంటూ సోమూ వీర్రాజు తమ మాటకు అధిష్టానం వద్ద విలువలేదని స్వయంగా బయటపెట్టుకొన్నారు.
బిజెపి హిందుత్వ అజెండాతో పనిచేస్తుంటుంది కనుక దానికి అనుగుణంగా దూసుకుపోయేందుకు జగన్ ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పిస్తున్నా ఏపీ బిజెపి అందిపుచ్చుకోలేకపోతోంది. గాఢనిద్రలో మెలకువ వస్తే ఏదో పలవరించిన్నట్లు, అప్పుడప్పుడు ఏపీ బిజెపి నేతలు జగన్ ప్రభుత్వం గురించి రెండు ముక్కలు మాట్లాడుతుంటారు.
ఈరోజు దగ్గుబాటి పురందేశ్వరి అలాగే, “జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది. ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. గుంతలు పూడ్చలేకపోతోంది. జీతాలు చెల్లించలేకపోతోంది,” అంటూ పలవరించారు. సోమూ వీర్రాజు కూడా “టిడిపి, వైసీపీలు రెండూ రాజధాని నిర్మించలేకపోయాయని” పలవరించారు. కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి రూ.10,460 కోట్లు సీల్డ్ కవరులో పెట్టి పంపించేసింది… ఏం చేశాకొంటారో చేసుకోండంటూ! రాష్ట్ర బిజెపి నేతలు మాటలకి, కేంద్ర ప్రభుత్వం (అధిష్టానం) వైఖరికి ఎక్కడా పొంతన ఉండదని ఈ రెండు పరిణామాలు నిరూపిస్తున్నాయి.
తెలంగాణ బిజెపి నేతలు చెపుతున్నట్లు, రాష్ట్ర బిజెపి నేతల మాటలకు అధిష్టానం పట్టించుకోవాలి. విలువ ఇవ్వాలి. అప్పుడే వారు సాధికారికంగా మాట్లాడగలరు. అప్పుడే వారి మాటలను ప్రజలు వింటారు. అలాగే పార్టీ విశ్వసనీయతను కాపాడుకోవడం చాలా అవసరం. అది లేనప్పుడు ప్రజలు ఎన్నటికీ దానిని నమ్మరు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, బిజెపి అధిష్టానం రెండు తెలుగు రాష్ట్రాలతో వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ రాష్ట్ర నేతల పాలిట శాపంగా కూడా మారుతోంది. తమ మాటకు అధిష్టానం వద్ద విలువలేకపోవడం, అధిష్టానమే తమ విశ్వసనీయతను ప్రశ్నార్దకంగా మారుస్తుండటం వలన వారి చేతికి అందివస్తున్న అవకాశాలను కూడా వారు వినియోగించుకోలేకపోతున్నారు. బహుశః అందుకే ఏపీ బిజెపి నేతలు కుంభకర్ణ నిద్రలో ఉండిపోతున్నారేమో?



